టీడీపీతో పొత్తు సరే-బీజేపీని వదిలించుకునేదెలా ? పవన్ సమీకరణాలివే !
ఏపీ రాజకీయాల్లో పొత్తుల హవా తిరిగి మొదలైంది. ఇప్పటికే అధికార పక్షం వైసీపీ ఒంటరిగానే పోరాడతామని తేల్చిచెప్పేయడంతో ఇక ఆ పార్టీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై విపక్షాలు ఏకమవుతున్నాయి. అమరావతి వంటి విషయాల్లో ఉమ్మడి స్వరం వినిపిస్తున్న విపక్షాలు.. ఇప్పుడు పొత్తుల విషయంలోనూ కలిసి సాగుతాయా లేక టీడీపీ-జనసేన పొత్తు మాత్రమే ఉంటుందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

ఏపీలో ముందస్తు రాజకీయం
ఏపీలో ఎన్నికల వేడి అప్పుడే రగులుగుతోంది. రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం వైసీపీతో పాటు మిగతా పార్టీలు ఇప్పటి నుంచే సంసిద్ధమవుతున్నాయి. అయితే ఈ ఎన్నికలు రెండేళ్ల తర్వాత కాకుండా ఏడాదిలోనే జరిగే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో పార్టీల వ్యూహాలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి రెండేళ్లలో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు బయటపెట్టడంతో ముందస్తు ఎన్నికల వేడి పెరుగుతోంది. దీంతో పార్టీలు కూడా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

కాక రేపుతున్న పొత్తులు
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఉన్న ఏకైక పొత్తు జనసేన-బీజేపీ మధ్య మాత్రమే. ఈ రెండు పార్టీలు 2024 ఎన్నికల్లో గెలుపు వ్యూహంతో గతంలో కలిశాయి. అయితే పేరుకు మాత్రమే పొత్తు ఉండగా.. ఆయా పార్టీలు సంయుక్తంగా పనిచేసిన సందర్భాలు వేళ్ల మీద లెక్క పెట్టేలా ఉన్నాయి. దీంతో ఈ పొత్తుకు కాలం చెల్లిందని ఎప్పటికప్పుడు మిగతా పార్టీలు అనుకునే పరిస్ధితి వచ్చేసింది. అదే సమయంలో పాత పొత్తును తిరిగి కుదుర్చుకునేందుకు జనసేన, టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా రాష్ట్రంలో పొలిటికల్ వేడిని రగిలిస్తున్నాయి.

టీడీపీ-జనసేన పొత్తు ఫైనల్
ప్రస్తుతం అధికార వైసీపీ ఉన్న పటిష్టమైన స్ధితిని చూసినా, గతంలో ఎదురైన అనుభవాల్ని దృష్టిలో ఉంచుకున్నా, తాజాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల బట్టి చూసినా టీడీపీ-జనసేన పొత్తు అనివార్యంగా కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తేనే వైసీపీకి గట్టిపోటీ ఇవ్వగలమన్న అంచనాకు వచ్చేశాయి. దీంతో వైసీపీ కూడా ఇద్దరినీ టార్గెట్ చేయడం మొదలుపెట్టేసింది. దీంతో ఎన్నికలకు చాలా ముందే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంత వరకూ క్లారిటీ ఉన్నా వీరిద్దరూ బీజేపీని కూడా కలుపుకుని వెళ్తారా లేదా అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

పవన్ నిర్ణయంపైనే ఉత్కంఠ ?
ప్రస్తుతం బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్.. ఆ పార్టీని వీడి టీడీపీతో జత కడతారా లేక కాషాయ సేనతో కలిసే టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా అన్న దానిపైనే చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు బీజేపీపై ధర్మపోరాటం చేసి దారుణంగా విఫలమైన చంద్రబాబును ఆ పార్టీ మళ్లీ చేరదీయలేదు. కానీ ఇప్పుడు అదే పార్టీ చంద్రబాబుతో పొత్తును బలంగా కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ తో పొత్తులో ఉంది. ఇప్పుడు పవన్ కు అవసరమైన చంద్రబాబుతో స్నేహం బీజేపీకి మాత్రం అవసరం లేదు. దీంతో బీజేపీ విషయంలో మరిన చంద్రబాబు వైఖరిని ఆ పార్టీ జాతీయ నేతలకు వివరించి పొత్తు కుదిర్చే బాధ్యత పవన్ పైనే పడింది. లేదంటే బీజేపీని వీడి టీడీపీతో పొత్తుకు పవన్ మొగ్గు చూపే అవకాశం ఉంది. అలా జరిగితే ఇప్పటికే వైసీపీకి మద్దతుగా ఉన్న బీజేపీ రేపు సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఆ పార్టీకి మద్దతిచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మరోసారి టీడీపీతో పాటు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన కూడా నష్టపోవడం ఖాయం. అందుకే పవన్ తీసుకోబోయే నిర్ణయం కోసం ఇప్పుడు చంద్రబాబుతో పాటు జగన్ కూడా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications