మత్స్యకారుల సమస్యలను వైసీపి గాలికి ఒదిలేసింది.!ఈనెల 21న నరసాపురంలో పవన్ కళ్యాణ్ సభ.!
అమరావతి/హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అమరావతిలో రాజకీయ క్రీడ విచిత్రంగా ఉంటుందని, చాలా వర్గాలను ఓటు బ్యాంకుగా పరిగణించి ఎన్నికల తర్వాత ఆ వర్గాలను పూర్తిగా మర్చిపోతారని పవన్ కళ్యాణ్ మండి పడ్డారు. అలాంటి అలసత్వానిక గురైన వర్గమే మత్స్యకారుల వర్గమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.
అణగారిన మత్స్యకారుల అభ్యున్నతి కాంక్షిస్తూ పవన్ కళ్యాన్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించే దిశగా వారికి భరోసా ఇచ్చేందుకు పవన్ ప్రణాళికలు రచిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 21వ తేదీన జనసేన పార్టీ జిల్లా నాయకులు, జన సైనికులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Recommended Video
ఇదే సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పాల్గొని మత్స్యకారుల సమస్యలపై ప్రసంగిస్తారని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నాయకులు, శ్రేణులు పవన్ కల్యాణ్ పర్యటన, కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. 21వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో సభ మొదలవుతుందని జనసైనికులు పేర్కొంటున్నారు. అదే రోజు ప్రపంచ మత్స్య దినోత్సవం కావడంతో పవన్ కల్యాణ్ వేదికపై మత్స్యకారుల అభివృద్ధి గురించి ప్రసంగిస్తారని తెలుస్తోంది. నరసాపురంలోని బహిరంగ సమావేశం వేదిక నుంచి రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వీరి జీవనోపాధికి విఘాతం కలిగించే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా నెలకొన్న పలు కీలక సమస్యలను జిల్లా నాయకులు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ సమస్యలను సైతం ప్రస్తావిస్తారని పార్టీ నేతలు వివరిస్తున్నారు.