జనసేన ఆఫీస్ ప్రారంభం, ఖురాన్ పఠించిన అలీ: అతిథిగా సామాన్యుడు, ఏం కావాలని పవన్ అడిగితే (ఫోటోలు)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు కార్యాలయాన్ని ప్రారంభించారు. తొలుత భరతమాతకు పూజలు చేశారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేసారు.
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు కార్యాలయాన్ని ప్రారంభించారు. తొలుత భరతమాతకు పూజలు చేశారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేసారు.
Recommended Video


సర్వమత ప్రార్థనలు
హైదరాబాద్, అమరావతిలలో త్వరలో పార్టీ కార్యాలయాలను సువిశాల స్థలాల్లో ఏర్పాటు చేయనున్నారు. సర్వమత ప్రార్థనల్లో భాగంగా నటుడు అలీ ఖురాన్ పఠించారు. ఆ తర్వాత తెలుగులో రాసిన ఖురాన్ ప్రతిని పవన్కు అలీ అందించారు.

మంగళవారం సాయంత్రం ప్రారంభం
ఈ మేరకు జనసేన పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో.. కొత్త హంగులు సంతరించుకున్న జనసేన పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు.

శాస్త్రోక్త పూజల అనంతరం
భరతమాతకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం సర్వమత ప్రార్థనలు జరిగాయి. తదుపరి కార్యాలయంలో పరిపాలనా కార్యక్రమాలను ఆరంభించారు.

ఇది పరిపాలనా సౌలభ్యంకోసం, రాజకీయ కార్యకలాపాలకూ వేరే
పార్టీ పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ప్రాంగణం పని చేస్తుందని, పార్టీ రాజకీయ కార్యకలాపాల కోసం విశాలమైన స్థలంలో హైదరాబాద్, అమరావతి నగరాలలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

కార్యాలయంలో ప్రతి విభాగాన్ని పరిశీలించిన పవన్
తొలుత శాస్త్రోక్తంగా వేదమంత్రాల ఘోష మధ్య హితులు, సన్నిహితులు, జనసేన ముఖ్య ప్రతినిధులు, అభిమానులు వెంట రాగా కార్యాలయంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ శాస్త్రోక్త లాంఛనాలన్నీ పూర్తయిన తర్వాత కార్యాలయంలోని ప్రతి విభాగాన్ని పరిశీలించారు.

ముస్లీం, క్రిస్టియన్ మత పెద్దలు, ఖురాన్ పఠించిన అలీ
అనంతరం ముస్లీం మత పెద్దలతో పాటు ప్రముఖ నటుడు అలీ దివ్య ఖురాన్ పఠించారు. క్రిస్టియన్ మత పెద్దలు బైబిల్లోని పవిత్ర స్త్రోత్రాలను పఠించి పవన్ కళ్యాణ్ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అలీ తెలుగులో రాసిన దివ్య ఖురాన్ ప్రతిని పవన్ కళ్యాణ్కు బహూకరించారు.

ముఖ్య అతిథిగా సామాన్యుడు
దేశంలో ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లాలని, స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థ ఆవిష్కృతం కావాలని గత ఇరవై సంవత్సరాలుగా గోడల మీద నినాదాలు రాస్తూ జనంలో చైతన్యం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్న తెలంగాణకు చెందిన జనసేన కార్యకర్త నిమ్మల వీరన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అభిమానించే వారు, అనుసరిస్తున్న వారు
జనసేన కార్యాలయ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ను అభిమానించేవారు, అనుసరిస్తున్న వారిలో కొందరు ముఖ్యులు హాజరైనట్లు జనసేన తన ప్రకటనలో పేర్కొంది. వారంతా శుభాకాంక్షలు తెలిపారు.

అందుకే రాజకీయ నాయకులు యువతను దూరంగా
ముఖ్య అతిథిగా వచ్చిన నిమ్మల వీరన్న మాట్లాడుతూ... ప్రస్తుతం యువకులు, విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత రాజకీయంగా చైతన్యం అయితే తమకు ఇబ్బంది అని రాజకీయ నేతలు భావించడమే దీనికి కారణమన్నారు.

పవన్ కళ్యాణ్ అందుకు పని చేయాలి
నిస్వార్థంగా పని చేసే రాజకీయ నాయకత్వం దేశానికి అవసరమని, అలాంటి నాయకత్వ రూపకల్పనకు పవన్ కళ్యాణ్ కృషి చేయాలని నిమ్మల వీరన్న విజ్ఞప్తి చేశారు.

సమాజానికి అవసరం
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నిమ్మల వీరన్నను తాను పన్నెండేళ్ల క్రితం తొలిసారి కలిసినట్లు చెప్పారు. వీరన్న నిస్వార్థ సేవకుడు అని, కాన్షీరాం నుంచి ప్రేరణ పొందిన వీరన్న వంటి సేవాతత్పరులు సమాజానికి అవసరమన్నారు.

ఏమైనా సాయం కావాలా అని పవన్ కళ్యాణ్ అడిగితే
బడుగు వర్గానికి చెందిన వీరన్నను తాను ఓసారి ఏమైనా సాయం కావాలా అని అడిగానని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అందుకు వీరన్న ఈ సమాజానికి మేలు చేయండి నాకు ఆ సాయం చాలునని చెప్పాడని, ఆయన మాటలు ఎప్పటికీ మరిచిపోలేనని పవన్ కళ్యాణ్ చెప్పారు.

త్రివిక్రమ్, అలీ తదితరులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, వాణిజ్యప్రముఖులు, టెక్కీలు, విద్యారంగ ప్రముఖులు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, విద్యావేత్తలు, సినీ రంగ ప్రముఖులు, పవన్ కళ్యాణ్ సన్నిహితులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, నిర్మాత సురేష్ బాబు, రచయిత సత్యానంద్, నటులు అలీ, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications