జనతా కర్ఫ్యూ: వైఎస్ జగన్, చంద్రబాబు చప్పట్లు, గంట మోగించిన నారా లోకేష్
హైదరాబాద్/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర సిబ్బందికి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎస్, ఇతర కార్యాలయ సిబ్బంది, అధికారులతో కలిసి ఆయన చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలిపారు.
Amaravati: Andhra Pradesh CM YS Jagan Mohan Reddy participates in the exercise called by PM Modi to express gratitude to those providing essential services amid #CoronavirusPandemic. pic.twitter.com/AJLZnLOexg
— ANI (@ANI) March 22, 2020
ఇక ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుటుంబసభ్యులతో కలిసి నివాసంలోనే చప్పట్లు కొట్టి వైద్యులు, సిబ్బంది, పోలీసులు, మీడియావారికి సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు, ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మనవడు నారా దేవాన్ష్, చంద్రబాబు సతీమణి నారా బ్రాహ్మణి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. కాగా, నారా లోకేష్ గంట మోగించారు.
A small token of appreciation to the doctors, nurses, paramedical staff, government officials, members of the armed forces & police, disaster mgmt officials and every kind person who cares for others #5baje5minute#JantaCurfew#clapforourcarers#Covid_19india pic.twitter.com/FeY8n4XHgb
— Lokesh Nara (@naralokesh) March 22, 2020
విజయవాడలో 144 సెక్షన్ ఏప్రిల్ 14 వరకు..
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తాజాగా విజయవాడలో కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో చర్యలకు ఉపక్రమించారు. కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని డీజీపీ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా కరోనా లక్షణాలు ఉంటున్నాయని, వారు విధిగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. లేదంటే కఠిన చర్యలుంటాయన్నారు.
కాగా, విజయవాడలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు నగరంలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు సీపీ తిరుమల రావు తెలిపారు. సోమవారం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని కోరారు. విజయవాడలో కంట్రోల్ రూం నెంబర్ 7995244260 ఏర్పాటు చేశామని, ఈ నెంబర్ కు ఫోన్ చేసి కరోనాపై ఫిర్యాదులుంటే చెప్పవచ్చని తెలిపారు.