జగన్ను అలా అన్నా, క్షమించండి: జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికరం
అనంతపురం: టీడీపీ పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై కుండబద్దలు కొట్టారు. కేంద్రంతో స్నేహం, బీజేపీకి కేంద్రం ఇచ్చిన హామీలు, జగన్ - బీజేపీల దోస్తీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఆయన స్పందించారు. ఆయన ముక్కుసూటిగా మాట్లాడుతారు.
కేంద్రం ఏపీకి ఏమీ చేయడం లేదని తాము చెప్పడం లేదని, కానీ ఆశించిన విధంగా చేయలేదని చెబుతున్నామన్నారు. క్రిమినల్ కేసులు ఉన్న జగన్తో వైసీపీ కలవదని తేల్చి చెప్పారు. విభజన నేపథ్యంలో ఏపీకి కేంద్రం మద్దతు అవసరమని, వచ్చే ఎన్నికల్లోను మోడీ గెలుస్తారని, కాబట్టి కేంద్రంతో ఘర్షణ వైఖరి సరికాదన్నారు.

జగన్, మోడీలను దెబ్బకొట్టాలని చూసిన జేసీ
జగన్, నరేంద్ర మోడీలను దెబ్బతీసేందుకు తాను రాజీనామా చేస్తానని చంద్రబాబుతో చెప్పానని, కానీ ఆయన అంగీకరించలేదని జేసీ చెప్పారు. రూ.10 కోట్ల రైల్వే జోన్ ఇవ్వని మోడీ ఏపీకి ఏం చేస్తారని దుయ్యబట్టారు. ఏపీకి రైల్వే జోన్ వచ్చే పరిస్థితి లేదన్నారు.

బీజేపీ ఏమీ ఇవ్వలేదని చెప్పడం లేదు
బీజేపీ ఏమీ ఇవ్వలేదని మేం చెప్పడం లేదని, చంద్రబాబు కొన్ని నిధులు సాధించారని, కానీ అనుకున్న స్థాయిలో రాలేదని జేసీ చెప్పారు. కేసులు పెడతామనే భయంతో తాము మోడీకి భయపడటం లేదని చెప్పారు. చంద్రబాబు ఎదిగితే తనకు ప్రమాదమని మోడీ భయపడుతున్నట్లుగా ఉందని చెప్పారు.

బీజేపీ నేతల వ్యాఖ్యలపై
సోము వీర్రాజు వంటి బీజేపీ నేతలు టీడీపీని విమర్శించడంపై జేసీ స్పందిస్తూ... కొందరు బీజేపీ నేతలకు అనుభవం లేక అలా మాట్లాడుతున్నారని, అనుభవం ఉన్నవారు మాట్లాడటం లేదన్నారు. సోము వీర్రాజు వంటి బీజేపీ నేతలు చేసిన విమర్శలను జేసీ కొట్టి పారేశారు.

జగన్ను వాడు అనడం తప్పే, క్షమించండి, ఈర్ష్య లేదు
జగన్ను వాడు అనడం తప్పేనని, ఎవరైనా బాధపడితే క్షమించాలని జేసీ చెప్పారు. వైసీపీ ఎంపీల రాజీనామా అంతా డ్రామానే అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసినా ఉప ఎన్నికలు రావని చెప్పారు. వైసీపీ రాజీనామా చేసి హోదా పోరులో ముందుకెళ్తుందనే ఈర్ష్య తనకు లేదన్నారు. రెండేళ్ల ముందు ఎందుకు రాజీనామా చేయలేదన్నారు.

జగన్ రాజీనామా ప్రకటన వెనుక
బీజేపీ చేసిన మోసానికి ఆ పార్టీ అంటే కోపం వస్తోందని జేసీ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీతో కలిసి ఉండాలన్నారు. ఇంత మాటల యుద్ధం నడిచాక కలిసి ఉండటం ఇబ్బందేనని, కానీ తప్పదని చెప్పారు. పార్లమెంటు ఎన్నికలు ముగిశాక ఎన్నికలు రావనే ఉద్దేశ్యంతోనే వైసీపీ రాజీనామా చేస్తానని చెబుతోందన్నారు. రాజీనామా చేసినా అప్పుడే ఆమోదించరని, అప్పటికి పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయని గుర్తు చేశారు.
ప్రత్యేక హోదా, విభజన హామీలు, ప్యాకేజీ విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందని జేసీ వాపోయారు. చంద్రబాబు అంటే ప్రధాని నరేంద్ర మోడీకి భయం అన్నారు. ప్రధానిని నమ్మి తమ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు మోసపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసుల మాఫీ కోసం, శిక్ష నుంచి తప్పించుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
నరేంద్ర మోడీ కొంత హానెస్టీ పర్సన్ అని, జగన్ వంటి అవినీతిపరులను ఆయన దగ్గరకు తీయరని తాము భావిస్తున్నామని జేసీ చెప్పారు. హోదా ఇస్తే మద్దతిస్తామని జగన్ చెప్పారని, ఆయన కేసుల నుంచి తప్పించుకునేందుకే అలా చేస్తున్నారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీపై జేసీ స్పందిస్తూ.. ఏపీకి వచ్చిన నిధులపై పూర్తి అవగాహన కోసం ఆయన కమిటీ ఏర్పాటు చేశారని, తనకు తెలుసు అనే అహంకారం పవన్లో లేదని, అన్నీ తెలుసుకొని ప్రజలకు ఏదో ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే మంచి ప్రయత్నం ఆయనది అన్నారు. ఓసారి ఓసారి జనసేన నాయకులు కలిసినప్పుడు రాజకీయాలు మీకు ఎందుకని చెప్పానని అన్నారు. మీరు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాజకీయాలు మీకు లాభం లేదని చెప్పానని అన్నారు. అవసరమైతే తన సీటు పవన్కు ఇస్తానని చెప్పారు. 2019లో ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మళ్లీ మోడీయే వస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications