ఏపీకి కేంద్రం మరో షాక్, 'రాజధాని'కి నో: అలా ఐతే వచ్చేది.. జేసీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా పైన కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ప్రత్యేక హోదా కల్పించి నిబంధన ఏమీ లేదని, కేంద్ర పన్నుల వాటా కింద ఏపీకి బాగానే నిధులు వస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా బుధవారం సభలో ప్రకటించారు.
ప్రత్యేక హోదా షాక్ మరవకముందే కేంద్రం ఏపీకి మరో షాకిచ్చింది. నవ్యాంధ్ర రాజధాని నుంచి విశాఖపట్నం, నాగపర్, రాయపూర్ మీదుగా ఢిల్లీకి నూతన రాజధాని ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి లేదని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా లోకసభలో బుధవారం వెల్లడించారు.
ఆచరణాత్మక, వనరుల పరిమితులే ఇందుకు కారణమని చెప్పారు. ట్రాఫిక్, ఆచరణీయ సాధ్యాసాధ్యాలు, వనరుల అందుబాటు వంటి అంశాలు అనుకూలిస్తే రాజధాని ఎక్స్ప్రెస్ సహా పలు నూతన రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. ఎంపీ మురళీ మోహన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు.
ఏపీకి మొండిచేయి: హోదాపై తేల్చిసిన కేంద్రమంత్రి
ఆశలు ఆవిరి: బిజెపిపై జేసీ అసంతృప్తి
బిజెపి మిత్ర ధర్మం మరిచిందని టిడిపి నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని, ఆశలన్నీ ఆవిరయ్యాయన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంత మందిని కలవాలో, ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేశామన్నారు.
కేంద్రంలో బీజేపీకి బొటాబొటీ మెజారిటీ ఉండి ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నారు. బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండడంతో, 36 మంది ఎంపీలు పోయినా వచ్చిన నష్టం ఏమీ లేదని భావించి, ఏపీకి మొండి చెయ్యి చూపించారన్నారు.
ఇక వినే ఓపికలేదు: ప్రత్యేక హోదాపై చేతులు జోడించి వేడుకున్న గల్లా
సాక్షాత్తూ నాటి ప్రధాన మంత్రి ఇచ్చిన హామీలకు విలువ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచాలని అంతా చెబుతున్నారని, కేంద్ర మంత్రులను కలిశామని, నీతి ఆయోగ్ను కలిశామని, వినతి పత్రాలిచ్చామని, రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని ఎన్నోసార్లు వారిని కలిసి చెప్పామన్నారు.
ఇవి కాకుండా ఇంకా ఎలా ఒత్తిడి పెంచాలని ప్రశ్నించారు. తమ రాజీనామాలతో స్పెషల్ స్టేటస్ వస్తుందని అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన 16 మంది తక్షణం రాజీనామాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రత్యేక హోదా కావాలని సామాన్య ప్రజానీకానికి ఉందని, వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం కనబడుతుందన్నారు.