ఏకపక్షమని జెపి, ఓపికపడ్దామని ఎర్రబెల్లి: ఈటెల వార్న్
హైదరాబాద్: విభజన ఏకపక్షంగా జరుగుతోందని లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ మంగళవారం ఆరోపించారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం జెపి, తెరాస శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్, తెలంగాణ తెలుగుదేశం ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర రావులు వేర్వేరుగా మీడియా పాయింటు వద్ద మాట్లాడారు.
ఇరు ప్రాంతాల వారితో మాట్లాడాలని జెపి డిమాండ్ చేశారు. విభజన ఏకపక్షంగా జరుగుతోందని, ఇప్పటి వరకు ఏర్పడిన రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఏర్పడలేదన్నారు. తెలంగాణ బిల్లు అసమగ్రంగా ఉందని, దానిని అసెంబ్లీలో ఎలా ప్రవేశ పెడతారని ప్రశ్నించారు. సమగ్ర వివరాలు లేకుండా చర్చ ఎలా జరుపుతారన్నారు. పూర్తి సమాచారం ఇచ్చాకే చర్చను చేపట్టాలన్నారు.
బిల్లులో హైదరాబాదు గురించిన వివరాలేమీ లేవన్నారు. అసాధారణ పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఏకాభిప్రాయం తర్వాతనే బిల్లును రాష్ట్రపతికి పంపించాలన్నారు. ఈ సమయంలో జెపి కాంగ్రెసు పార్టీ పైన మండిపడ్డారు.
వెకిలి యత్నాలు ఆపాలి: ఈటెల
తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు వెకిలియత్నాలు ఆపాలని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. బిల్లు పైన అవసరమైతే 294 మంది సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పించుదామన్నారు. సీమాంధ్రకు ఏం కావాలో ఆ ప్రాంత సభ్యులు కోరాలన్నారు. అసెంబ్లీ నిషేధిత ప్రాంతమన్న భావన కలుగుతోందన్నారు.
స్పీకర్ పైన కిరణ్ ఒత్తిడి: ఎర్రబెల్లి
తెలంగాణ బిల్లుపై చర్చ జరగకుండా స్పీకర్ పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేల వాయిస్ అంతా బిల్లుపై ఒకటే అన్నారు. చర్చ నిన్ననే ప్రారంభమైందన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు తగాదా కోరుకుంటున్నారని, మనం ఓపిక పడదామని టి నేతలకు సూచించారు. చంద్రబాబు తెలంగాణ బిల్లుకు సహకరిస్తున్నారన్నారు. చర్చను ఆపే ప్రయత్నం చేస్తే ఊరుకోమన్నారు.