ఏపీలో జూడాల సమ్మె విరమణ- సర్కార్తో చర్చలు సఫలం
ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి నిర్ధిష్టమైన హామీ లబించడంతో సమ్మె విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. తమ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సమ్మెకు దిగిన వైద్య విద్యార్ధులు.. డిప్యూటీ సీఎం ఆళ్లనానితో జరిపిన చర్చలు సఫలమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఆరోగ్య భద్రతతో పాటు కోవిడ్ ప్రోత్సాహకాలు, ఎక్స్గ్రేషియా, స్టయిఫండ్ పెంపు వంటి డిమాండ్లతో ఇవాళ్టి నుంచి దశలవారీగా రాష్ట్రంలో సమ్మె చేపట్టాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. అటు తెలంగాణలో జూనియర్ డాక్టర్లు కూడా తాజాగా ఇవే డిమాండ్లతో సమ్మె చేపట్టి విజయవంతం కావడంతో ఏపీలోనూ వైద్యవిద్యార్ధులు అదే బాట పట్టారు. ఉదయం సమ్మెకు దిగిన తర్వాత జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలకు సిద్దమైంది. డిప్యూటీ సీఎం ఆళ్లనానితో పాటు వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ జరిగిన చర్చలు ఫలించాయి.
వాస్తవానికి జూనియర్ డాక్టర్లు ఎప్పటి నుంచో ఇవే డిమాండ్లు వినిపిస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి సమ్మెకు దిగడంతో ప్రభుత్వం దిగిరాక తప్పడం లేదు. ఇవాళ్టి నుంచి దశల వారీగా విధులు బహిష్కరించేందుకు జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు. చివరి నిమిషంలో ప్రభుత్వం రంగంలోకి దిగి చర్చలకు ఆహ్వానించింది. జూనియర్ డాక్టర్ల సంఘం నేతలతో వైద్యమంత్రి ఆళ్లనాని జరిపిన చర్చల్లో ప్రభుత్వం వారి డిమాండ్లను అంగీకరించింది. త్వరలో వీటిని అమలు చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.