శవాలపై పేలాలు ఏరుకునే బ్యాచ్!: చిరు-జగన్పై జూపూడి, బాలయ్య పిలుపు
హైదరాబాద్: రాజమండ్రి ఘటనను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఆపాదించడంపై జూపూడి ప్రభాకర రావు స్పందించారు. ఇది గర్హనీయమన్నారు. జరిగిన సంఘటన పైన విచారం వ్యక్తం చేయకుండా, వివాదాస్పదం చేయడం విడ్డూరమన్నారు.
ఓ వైపు భక్తులు పుణ్యస్నానాలు చేస్తుంటే విపక్షాలు టిడిపి పైన విషభాణాలు వేస్తోందన్నారు. మీ పార్టీ తరఫున మీరు ఎవరినైనా వాలెంటీర్లను పంపించారా అని ప్రశ్నించారు. మేం ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారా అని జూపూడి ప్రశ్నించారు.
ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతి పార్టీకి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారన్నారు. అయినప్పటికీ ఈ ఘటనను చంద్రబాబుకు ఆపాదిస్తూ వివాదాస్పదం చేయాలనుకోవడం విడ్డూరమన్నారు. జరగరాని దుర్ఘటన జరిగినప్పుడు ఒకరు రాజీనామా చేయమనడం, మరొకరు మరోలా మాట్లాడటం విడ్డూరమని చిరంజీవి, జగన్ను ఉద్దేశించి అన్నారు.
నిన్నటి వరకు పుష్కరాల విషయమై ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భయపడ్డారని, ఇప్పుడేమే చనిపోయిన సంఘటన నుండి పేలాలు ఏరుకుందామని చూస్తున్నారని మండిపడ్డారు. శవాల పైన రాజకీయం చేసే బ్యాచ్ అని ధ్వజమెత్తారు. భక్తులు మృతి చెందడం బాధాకరం అన్నారు. మనం రెండు కన్నీటి బోట్లు కార్చాలని, టిడిపికి ఏమైనా సూచనలు చేయాలన్నారు.
అభిమానులకు బాలకృష్ణ పిలుపు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట ఘటన పైన సినీ నటుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని అభిమానులకు పిలుపునిచ్చారు.