టిడిపి అంతానికి ఆ ముగ్గురి కుట్ర, జగన్ వల్లే పార్టీ వీడుతున్నారు: గాలి ఫైర్
గుంటూరు/నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, జూపూడి ప్రభాకర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చూసి.. ఆయన వెంట ఉంటే తమకు భవిష్యత ఉండదన్న భయంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి పారిపోతున్నారని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ధ్వజమెత్తారు.
గడప గడపకూ తిరుగుతున్న జగన్ పార్టీ నేతలను జనం తరిమిగొడుతున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్రావు అన్నారు. ఆదివారం గుంటూరులో గాలి ముద్దుకృష్ణమ నాయుడు, నెల్లూరులో జూపూడి వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ రూ.లక్ష కోట్లు సంపాదించారని, ఆయనే అధికారంలో ఉంటే రూ.ఐదు లక్షల కోట్లు సంపాదిస్తారని ముద్దుకృష్ణమ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్ కలిసి టీడీపీని అంతం చేయడానికి రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే విచారణ పూర్తి కాకుండానే జగనకు బెయిల్ వచ్చేలా చేశారని మండిపడ్డారు. అగస్టా కుంభకోణం పుట్టింది ఏపీలో అని, వైయస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మొదటి హెలికాప్టర్ను కొన్నారని చెప్పారు.
ఈ స్కాం నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ జీఎస్టీటీ బిల్లును అడ్డం పెట్టుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక హోదాకు కలిసి రావాలంటూ మాట్లాడుతున్నారని, విభజన సమయంలో ఈ అంశాన్ని బిల్లులో ఎందుకు పెట్టించలేదని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషిని చూసి ఏమిచేయాలో పాలుపోక వైసీపీ నేతలు గడపగడపకూ అబద్ధాలు చెబుతూ తిరుగుతున్నారని జూపూడి నెల్లూరులో తెలిపారు.
ఎన్నికలకు ముందు పచ్చని రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని తెలుగు ప్రజలు చరిత్రలో మరచిపోరని గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. పాపపరిహారం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాళ్లపై పడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలన్నారు.
రాజధాని ఎక్కడో చెప్పకుండా, ఆదాయాన్ని సమంగా పంచకుండా, సాగునీటి వివాదాలకు సక్రమంగా తెరదించకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బతీసి రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలనే దుర్బుద్ధితో హడావుడిగా రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు.
ప్రత్యేక హోదా, ప్యాకేజీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబును విమర్శించే అర్హత ప్రతిపక్ష నేత జగన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘవీరారెడ్డికి లేదన్నారు.