గర్ల్ఫ్రెండ్తో కలిసి భార్య హత్య.. ఆమెను బుట్టలో పడేసి..
అతను కోర్టుకు హాజరైన సమయంలో పలువురు న్యాయవాదులు కోర్టు బయట నిరీక్షించారు. అతను బయటకు రాగానే వారు.. రెండుసార్లు తోసేసి చితకబాదారు. పోలీసులు కల్పించుకొని పీయూష్ను రక్షించారు. భార్యను హత్య చేసిన కేసులో ఐదుగురు నిందితులు కోర్టుకు హాజరయ్యారు. పీయూష్, అతని గర్ల్ ఫ్రెండ్ మనీషా మఖీజా కూడా హాజరైంది. భారీ బందోబస్తు మధ్య వారిని కోర్టుకు తీసుకు వచ్చారు. అనంతరం వారిని జైలుకు తరలించారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో షాకింగ్ అంశాలు వెల్లడయ్యాయట. ట్రేడర్ కోడలు అయిన జ్యోతి దాసానిని ఆమె భర్త పీయూష్ శ్యామ్ దాసాని హత్య చేశాడు. పియూష్ దాసాని భయంకరమైన స్త్రీలోలుడని పోలీసులు వెల్లడించారు. పెళ్లయిన తరువాత పక్కింట్లో ఉండే ఓ కంపెనీ యజమాని కుమార్తె మనీషా మఖీజాను ముగ్గులోకి దింపడమే కాకుండా పలువురు యువతులతో అక్రమ సంబంధాలు నెరిపాడట.
పోలీసులు అతడి కాల్ లిస్టు ద్వారా పలు విషయాలు తెలుసుకున్నారట. గత రెండునెలల కాలంలో మనీషా మఖీజాకు 663 సార్లు ఫోన్ చేశాడు. తమ కంపెనీలో పని చేసే మరో యువతికి 330 సార్లు ఫోన్ చేశాడు.
ఇలాంటి ఫోన్ కాల్స్ చాలా ఉన్నాయట. అది పక్కన పెడితే తన ప్రియురాలితో నిత్యం మాట్లాడేందుకు, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మనీషా మఖీజాకు ఐదు సిమ్ కార్డులు నకిలీ అడ్రస్లతో కొనిచ్చాడట. వీరి వ్యవహారం పసిగట్టి అడ్డుపడుతుండడమే కాకుండా, విషయాన్ని కుటుంబ సభ్యుల ముందు బట్టబయలు చేసిందన్న కోపంతో భార్యను ప్రియురాలు, అతడి డ్రైవర్, అతడి స్నేహితుడి సాయంతో పద్నాలుగు సార్లు పొడిచి చంపాడు.