ఆ కుర్చీలో జగన్ ఇంకెవరిని కూర్చోనివ్వరు, జగన్ వల్లే ఫిరాయింపులు : జ్యోతుల నెహ్రూ
హైదరాబాద్ : వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిపోయిన ఎమ్మెల్యేలంతా.. జగన్ తీరు పట్ల విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. పార్టీలో ఉన్నప్పుడు జగన్ వైఖరిపై ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయని నేతలు, పార్టీ నుంచి బయటపడ్డాక మాత్రం పలు ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తాజాగా జగన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా జగన్ విషయాలను ప్రస్తావించిన జ్యోతుల నెహ్రూ.. జగన్ ని ఓ ఏకపక్ష నేతగా అభివర్ణించారు. సమిష్టి నిర్ణయాలకు జగన్ అవకాశం ఇవ్వరని, అంతా ఏకపక్షంగా చేసుకుంటూ పోతారన్న ధోరణితో మాట్లాడారు.
అలాగే పార్టీ కార్యాలయంలో ఉండే ఓ సీట్లో.. జగన్ తాను తప్ప ఇంకెవరూ అందులో కూర్చోవడానికి అంగీకరించరని తెలిపారు. ఇదే అనుభవం స్వయంగా తనకు కూడా ఎదురైందని చెప్పిన ఆయన, పార్టీకి సంబంధించిన విషయమేదో మాట్లాడడానికి కార్యాలయానికి వెళ్లినప్పుడు ఆ సీట్లో కూర్చుకోవడానికి ప్రయత్నించానని, గమనించిన జగన్ తనను అందులో కూర్చోవద్దని చెప్పారన్నారు.
పార్టీ ఫిరాయింపులకు పూర్తి బాధ్యత నాయకత్వానిదేనని, నాయకత్వ లోపం వల్లే వైసీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరుతున్నారని ఆరోపించారు. ఇక సొంత రాజకీయాల గురించి మాట్లాడుతూ, గతంలో టీడీపీని తనను వేరు చేసి మాట్లాడలేని పరిస్థితి ఉండేదని, అయితే మారిన సమీకరణాల దృష్ట్యా చిరంజీవికి మద్దతునివ్వాలనే ఉద్దేశంతో పీఆర్పీలో చేరానని చెప్పారు. అటు తర్వాత వైసీపీలో చేరారు నెహ్రూ.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఇక యనమల రామకృష్ణుడుతో తనకెలాంటి విభేదాలు లేవని, తాను ఎదగడాన్ని జీర్ణించుకోలేనివారితో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఎవరి త్యాగంతో పని లేకుండా పార్టీలో ఉన్నత స్థానాన్ని కోరుకుంటున్నానన్నారు.