'పవన్ కళ్యాణ్ అంతమొనగాడైతే, చిరంజీవి పార్టీ మాటేమిటి, దాని వెనుక మర్మమేమిటో?'
కడప: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన టీడీపీ నేతలు రివర్స్ అవుతున్నారు. 2014 ఎన్నికల అనంతరం తమ గెలుపులో ఆయన పాత్ర ఉందని తెలుగు తమ్ముళ్లు చెప్పారు. ఆ తర్వాత ఆయన ప్రశ్నించిన ప్రతి సమస్యపై సాదరంగా స్పందించారు. కానీ ఎప్పుడైతే అవినీతి ఆరోపణలు, ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారో అప్పటి నుంచి తెలుగు తమ్ముళ్లు జనసేనానిపై ఎదురుదాడి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ వల్ల తమకు ఓట్లు రాలేదని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఇప్పటికే చెప్పారు. కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి మరో అడుగు ముందుకేశారు. అసలు పవన్ మొనగాడైతే 2009లో ప్రజారాజ్యం పార్టీని ఎందుకు గెలిపించలేదని ప్రశ్నించారు.
పీఆర్పీని నడపలేక కాంగ్రెస్లో ఎందుకు కలిపేశారు
2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చానని, తానే గెలిపించానని పవన్ కళ్యాణ్ పదేపదే ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని రెడ్యం మండిపడ్డారు. ఆయన అంత మొనగాడైతే తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంను ఎందుకు గెలిపించలేదో చెప్పాలన్నారు. కనీసం పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం ఎందుకు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ విమర్శల వెనుక మర్మమేమిటో?
పవన్ కళ్యాణ్, వైయస్ జగన్లు కేంద్రం, మోడీలు ఆడించే తోలుబొమ్మలాటలో జుట్టు పోలిగాడు, బుడ్డ కేతిగాడులా వ్యవహరిస్తున్నారని రెడ్యం ఎద్దేవా చేశారు. వీరికి 2019 ఎన్నికల్లో ప్రజానీకం బుద్ధి చెప్పక తప్పదన్నారు. చంద్రబాబులాంటి పరిపాలనాధక్షుడు దేశంలోనే లేని చెప్పిన పవన్ ఇప్పుడు విమర్శలే పనిగా పెట్టుకున్నారన్నారు. దీని వెనుక మర్మం ఏమిటో చెప్పాలన్నారు.
శుద్ధి చేయడమంటే మోడీకి మద్దతివ్వడమే
ఏపీ విభజన హామీల కోసం, ప్రత్యేక హోదా కోసం ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు ఢీ అంటే ఢీ అంటూ ధర్మపోరాట దీక్ష చేస్తే వైసీపీ మాత్రం చిల్లర రాజకీయాలు చేస్తోందని రెడ్యం ఆరోపించారు. కేంద్రంతో రాజీపడి, మోడీతో కుమ్మక్కై విశాఖలో ధర్మపోరాట దీక్ష ప్రాంగణాన్ని గంగాజలంతో శుద్ధి చేయాలని, ధర్మపోరాటానికి వ్యతిరేకంగా ర్యాలీ చేయాలని వైసీపీ నిర్ణయించడం మోడీకి, కేంద్రానికి మద్దతివ్వడమే అన్నారు. జగన్, విజయసాయిలది నీచ రాజకీయానికి పరాకాష్ట అన్నారు.
Recommended Video
తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతీయడమే
కేంద్రంతో, మోడీతో అలుపెరగని పోరాటం చేస్తున్న చంద్రబాబును విమర్శించడం అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని రెడ్యం అన్నారు. తిరుమల శ్రీవారి నగలు దోచుకున్నారని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దింది చంద్రబాబే అన్నారు. లక్షకోట్లు దోచుకున్న ఏ1, ఏ2లు చంద్రబాబును అనడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే అన్నారు. బాబు నిప్పులాంటి మనిషి అన్నారు.