పవన్ ఓ జోకర్-జనసేనను గుర్తించం-జగన్ సవాల్ చంద్రబాబు స్వీకరించాలన్న కాకాణి ...
ఏపీలో విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు సీఎం జగన్ విసిరిన సవాల్ స్వీకరించాలని వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోరారు.
ఏపీలో విపక్ష నేతలపై సీఎం జగన్ తాజాగా తెనాలి సభలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో పరిస్ధితుల్ని, వైసీపీ పాలనలో పరిస్ధితుల్ని పోల్చారు. అలాగే పవన్ కళ్యాణ్ పైనా విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన విడివిడిగా 175 సీట్లలో పోటీ చేసి గెలవాలని జగన్ సవాల్ చేసారు. దీనికి కొనసాగింపుగా ఇవాళ ఆయన కేబినెట్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు, పవన్ పై విమర్శలకు దిగారు.
చంద్రబాబు హయాంలో ఎప్పుడూ కరువు కాటకాలు ఉండేవని, ఆయన మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పిన మాట వాస్తవం కాదా? అని మంత్రి కాకాణి ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించలేదని,
టీడీపీ నాయకులు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారన్నారు. 175 సీట్లలో పోటీపై సీఎం సవాల్ ను స్వీకరించే దమ్ము చంద్రబాబు కు ఉందా? అని కాకాణి ప్రశ్నించారు. ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదంటే చంద్రబాబు ఫెయిల్ అయినట్లే కదా అని అన్నారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నాడని, తాము ఒకరితో కలవాల్సిన అవసరం లేదన్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ పైనా కాకాణి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ను,ఆయన పార్టీని అసలు తాము గుర్తించడం లేదన్నారు. పవన్ గురించి మాట్లాడితే తమకు అవమానమన్నారు. పవన్ కళ్యాణ్ స్థాయి తోలుబొమ్మలాట లో జోకర్ మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్ళే అంశాన్ని కూడా ప్రతిపక్షాలు నిర్దేశిస్తాయా అని కాకాణి ప్రశ్నించారు. తాడేపల్లి నుంచి తెనాలికి 28 కిలోమీటర్ల దూరానికి సీఎం జగన్ హెలికాఫ్టర్ లో వెళ్లడాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించడాన్ని కాకాణి తప్పుబట్టారు.












Click it and Unblock the Notifications