'కల్తీమద్యం ఘటనపై బొత్స, అవినీతిపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదం'
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాల్మనీ వ్యవహరంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోదరుడిని అరెస్ట్ చేయడం తమ చిత్తశుద్ధికి నిదర్శమన్నారు.
కాల్మనీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 27 మంది వైసీపీ సభ్యులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ శిష్యులేనని అన్నారు. వైయస్ జగన్ హయాంలో మహిళలపై అరాచకాలకు విజయవాడ అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు.

కాగా, కల్తీమద్యం ఘటనపై బొత్స సత్యనారాయణ, అవినీతిపై వైయస్ జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో బాక్సైట్, ఇసుక, నీరు-చెట్టు శ్వేతపత్రాలపై చర్చలో ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలు చేయాలని ఆయన కోరారు.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ దందాకి సంబంధించి పోలీసుల సోదాలు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు పాకాయి. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండల కేంద్రంలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు చేస్తున్నారు.
బుధవారం స్థానికంగా ఉన్న పలువురు వ్యాపారుల నుంచి కీలక పత్రాలు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. రాత్రి వరకు తనిఖీలు సాగుతాయని సీఐ జి.దాసు తెలిపారు. కాల్మనీ వ్యవహారంలో ఇప్పటివరకు 118 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టయినవారిలో వివిధ పార్టీలకు చెందినవారున్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 123 కేసులు నమోదయ్యాయి. కాల్ మనీ వ్యవహారాలకు కేంద్రంగా భావిస్తున్న విజయవాడలోనే 42 కేసులు నమోదయ్యాయి. విజయవాడలో 36మంది నిందితుల్లో 13 మంది తెలుగుదేశం పార్టీకి చెందినవారు కాగా, 11 మంది కాంగ్రెస్, ఆరుగురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, ముగ్గురు సీపీఐకి చెందినవారు ఉన్నారు.












Click it and Unblock the Notifications