కాపు గర్జన తర్వాత..: బాబుకు చిరంజీవి మరో హెచ్చరిక, 'ప్లాన్ ప్రకారమే విధ్వంసం'
హైదరాబాద్/విజయవాడ: కాపు గర్జన, తుని దుర్ఘటన పైన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తదితరులు సోమవారం నాడు స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వంపై చిరంజీవి ఘాటుగా స్పందించారు.
ఆయన నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. కాపు గర్జనలో హింసాత్మక ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని చిరు ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పారదర్శకత లేని పాలన వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు.
కాపు ఉద్యమాల నేత: ఎవరీ ముద్రగడ?
ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాకుండా, విభజించి పాలించు అన్నట్లుగా వ్యవహారం ఉందని చంద్రబాబుకు రాసిన లేఖలో చిరంజీవి దుయ్యబట్టారు. ఎదురు దాడితో ప్రతిపక్షాల నోళ్లను మూయించలేరన్నారు. కాపులు, బీసీలు, మహిళలే కాదు... చివరకు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కూడా ఉద్యమించబోతున్నారని చంద్రబాబును చిరంజీవి హెచ్చరించారు. ఇకనైనా హామీలు నెరవేర్చాలన్నారు.
ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మాట్లాడుతూ... కాపు గర్జన సమయంలో జరిగిన ఘటనను ఖండిస్తున్నామన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా టిడిపి ప్రయత్నాలు చేస్తోందన్నారు. కర్నాటక, తమిళనాడు మాదిరి రిజర్వేషన్లు అమలు చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు.
ప్లాన్ ప్రకారమే విధ్వంసం జరిగినట్లుగా ఉంది: అడిషనల్ డీజీ ఠాకూర్
తునిలో హింసాత్మక ఘటన పథకం ప్రకారమే జరిగినట్లుగా కనిపిస్తోందని అడిషనల్ డిజి ఠాకూర్ అన్నారు. జిల్లాలో ఐదువేల మంది సిఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించినట్లు చెప్పారు. కాపుల ఆందోళన సందర్భంగా పోలీసులు సంయమనం పాటించారన్నారు.
తుని ఘటనలో పదిహేను మంది పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. ఈ ఘటన వెనుక నిఘా వైఫల్యం లేదని, బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైలు ప్రయాణీకులను పోలీసులు కాపాడారని, లేదంటే ప్రాణ నష్టం జరిగేదన్నారు. కాగా, విధ్వంసం ఉద్దేశ పూర్వకంగా జరిగిందేనని పోలీసు ఉన్నతాధికారులు చెబుతుండటం గమనార్హం.
కాపులను మోసం చేస్తున్నారు: కళా వెంకట్రావు
ముద్రగడ పద్మనాభం, వైయస్ జగన్ కలిసి ఉద్యమం పేరుతో కాపులను మోసం చేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు ఆరోపించారు. తుని ఘటనపై ఆ ఇద్దరూ కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం దారుణమన్నారు.
ఐక్యగర్జన పేరుతో కాపుల సమస్యలను తెలియజేస్తారని ప్రభుత్వం భావించిందే తప్ప హింసాత్మక ఘటనలకు పాల్పడతారని ఊహించలేదన్నారు. కాపులకు టిడిపి ఎప్పుడూ అండగా ఉంటుందని, మేనిఫెస్టోలోని అంశాలను అమలుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు.
కాపు గర్జనలో 'వంగవీటి రంగా' నినాదాలు
ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో జరిగిన కాపు గర్జనలో సభకు వచ్చిన వారు వంగవీటి మోహన రంగా పేరుకు అనుకూలంగా పదేపదే నినాదాలు చేశారు. మోహన్ రంగా అమర్ రహే, రంగాకు జై అంటూ నినాదాలు చేశారు. ఆయన ఫోటోను స్టేజ్ మీదకు తీసుకు వెళ్లి.. హీరో మోహన్ రంగా అంటూ నినాదాలు చేశారు.