అతడి ఇంట్లో జగన్, పవన్ కలిశారు...సీట్ల సర్ధుబాటు కాలేదు:కారెం శివాజీ సంచలనం
Recommended Video

తూర్పుగోదావరి:ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్కల్యాణ్ గురించి ఎపి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే విశాఖపట్టణంలోని వట్టి రవి ఇంట్లో జగన్, పవన్ కలిసారని కారెం శివాజీ వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వట్టి రవి ఇంట్లో కలిసిన జగన్, పవన్ మధ్య పొత్తు, గురించి సీట్ల సంఖ్య గురించి కీలక చర్చలు జరిగాయన్నారు. అయితే ఈ చర్చల్లో సీట్ల సర్ధుబాటు కాకపోవడంతో వీరి మధ్య పొత్తు ఖరారు కాలేదని కారెం శివాజీ చెప్పుకొచ్చారు.
"వైసిపి అధినేత జగన్ విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న సమయంలో వట్టి రవి నివాసంలో పవన్ను జగన్ కలిసి 40 సీట్లు ఆఫర్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ అప్పటికే సీఎం సీటుపై దృష్టి పెట్టి ఉండటంతో ఆ సీట్లకు ఆయన ఒప్పుకోలేదు. అలా ఆ చర్చల్లో సీట్లు సర్దుబాటు కాక వీరి పొత్తు పొడవలేదు."...అని కారెం శివాజీ వెల్లడించారు.

అయితే కులం, మతం పునాదులపై వారు ఎప్పటికీ అధికారంలోకి రాలేరని కారెం శివాజీ విశ్లేషించారు. జగన్,పవన్ వీరిద్దరూ ప్రధాని మోడీ చెప్పినట్లుగా ఆడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారని కారెం శివాజీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏపీని నమ్మించి దగా చేసిందన్నారు.
అధికారంలోకి వస్తే విభజన హామీలను నెరవేర్చి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం వల్లే రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారని శివాజీ వివరించారు. బిజెపితో సహా ప్రతిపక్షాలు ఆ కూటమిని చూసి భయంతో, ఓర్వలేనితనంతో కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని కారెం శివాజీ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications