2019లో జగన్ని సీఎంగా చేసి.., ఆట మొదలైంది: మహేష్, వైసిపిలో చేరినందుకే..
2004కు ముందు పరిస్థితులు మళ్లీ పునరావృతం అవుతున్నాయని, 2019లో జగన్ను ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబు నియంత పాలనకు స్వస్తి పలకాలని కాసు మహేష్ రెడ్డి అన్నారు.
నరసారావుపేట: 2004కు ముందు పరిస్థితులు మళ్లీ పునరావృతం అవుతున్నాయని, 2019లో జగన్ను ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబు నియంత పాలనకు స్వస్తి పలకాలని కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
దశాబ్దాలుగా నరసారావుపేట ప్రాంత ప్రజలకు తమ కుటుంబంతో బంధం, అనుబంధం కొనసాగుతోందని, వారి రుణం తీర్చుకోవడానికే వైసిపిలోకి వచ్చానన్నారు. ఎనభై ఏళ్లుగా తమ కుటుంబానికి ప్రజలతో విడదీయరాని బంధం ఉందన్నారు.
టీడీపీ ఆనందానికి చెక్: వైసిపిలోకి మహేష్, వెంటనే టిక్కెట్ ప్రకటించిన జగన్
ఆట మొదలైంది
చేయి చేయి కలిపి తిరగబడదామని, ఇంటింటికీ వెళ్లి వైసిపిని బలపరచాలని కోరుతామన్నారు. ఆట మొదలైందని, తెలుగుదేశం పార్టీ పాలన రెండేళ్లు రెండు ఘడియలుగా పూర్తవుతుందని, అనంతరం ప్రజా ప్రభుత్వాన్ని తీసుకువద్దామన్నారు.
రాష్ట్రంలో ఆటవిక రాజ్యం ఉందని, తఅందరు కలిసి పోరాడితే జగన్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. అప్పుడు రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందన్నారు.

అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. మహేష్ రెడ్డి చేరికతో పల్నాడులో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. నరసారావుపేటలో కోడెల, ఆయన కొడుకు అవినీతి అంతా ఇంతా కాదన్నారు. టిడిపి హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారన్నారు.
కుర్చీల కోసం ఆరాటం
నరసారావు పేట సభకు జగన్ సాయంత్రం ఐదు గంటలకు రావాల్సింది. కానీ ఏడున్నర గంటలకు వచ్చారు. జగన్ సభా వేదిక వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా సభలోని కార్యకర్తలు ముందుకు తోసుకురావడంతో గందరగోళం నెలకొంది. సభకు సమీపంలో ఏర్పాటు చేసిన లైట్లు, సౌండ్ సిస్టమ్ ఒరిగిపోయాయి. పలుమార్లు నేతలు వారించినా యువత చొచ్చుకు వచ్చారు.
నేతలు మాట్లాడుతున్న సమయంలో సభలో వెనుక వైపు ఉన్నవారికి వేదిక కనిపించకపోవడంతో కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకున్నారు. జనం తోపులాటతో ఒకరిపై ఒకరుపడ్డారు.
అమరావతిలోనా, అడవిలోనా?
బుధవారం నాడు కృష్ణా జిల్లా నిడమానూరు సర్పంచ్ కోటేశ్వర రావు వైసిపిలో చేరారు. ఆయన అంతకుముందు టిడిపి నేత. గురువారం ఆయన కారు తగలబడింది. కోటేశ్వర రావు వైసిపిలో చేరినందున టీడీపీ నేతలే ఈ పని చేశారని వైసిపి నేతలు ఆరోపించారు.
దీనిపై శుక్రవారం జగన్ స్పందించారు. ఈ దాడి చూస్తుంటే అమరావతిలో ఉన్నామా, లేక అడవిలో ఉన్నామా అర్థం కావట్లేదన్నారు. పంచాయతీ సర్పంచులకు బీఫారం ఉండదని, పార్టీ గుర్తు ఉండదని, అలాంటప్పుడు సర్పంచిని టిడిపి అభ్యర్థిగా ఎలా భావిస్తారన్నారు.












Click it and Unblock the Notifications