ప్రధానితో భేటీ: కావూరి, కిల్లి కృపారాణి సైడ్ లైన్?
న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తో సోమవారం జరిగిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల సమావేశంలో కావూరి సాంబశివ రావు, కిల్లి కృపారాణి సైడ్ లైన్ అయినట్లు తెలుస్తోంది. తమ రాజీనామాలను ఆమోదించాలని చిరంజీవి, దగ్గుబాటి పురంధేశ్వరి, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రధానిని కోరగా, కావూరి సాంబశివ రావు, కిల్లి కృపారాణి ఏమీ మాట్లాడలేదని తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండే ఉద్దేశంతోనే వారు మాట్లాడలేదని అంటున్నారు.
ఆదివారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ తర్వాత రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు కనిపించిన పళ్లంరాజు సోమవారం రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. రాజీనామాలపై డ్రామా ఆడుతున్నారంటూ విమర్శలు రావడంతో చిరంజీవి, దగ్గుబాటి పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పళ్లం రాజు ప్రధానిని కలిశారు. ఈ సమావేశంలో హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా పాల్గొన్నారు.
తాము పార్టీకి విధేయులమే గానీ తమ ప్రాంత ప్రజలకు తాము జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చిరంజీవి అన్నారు. తమ ప్రజల వద్దకు వెళ్లడానికి, వారి మనోభావాలను గౌరవించడానికి తాము రాజీనామాలు చేయక తప్పడం లేదని చెప్పినట్లు సమాచారం.
దగ్గుబాటి పురంధేశ్వరి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను పంపినట్లు వార్తలు వచ్చాయి. అయితే, సీమాంధ్ర ప్రజలు దాన్ని విశ్వసించకపోవడంతో సోమవారం ప్రధానిని కలిసి ఆమె రాజీనామా లేఖ ఇచ్చినట్లు చెబుతున్నారు. కాగా, జెడి శీలం, కిశోర్ చంద్రదేవ్ రాజీనామాలకు దూరంగా ఉంటారని తెలుస్తోంది. పనబాక లక్ష్మి తాను రాజీనామా చేయబోనని బహిరంగంగానే చెప్పారు.
కాగా, సీమాంధ్ర ఆందోళన పట్ల సుశీల్ కుమార్ షిండే ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలు విరమించి శాంతియుత వాతావరణాన్ని పాటించాలని ఆయన సూచించారు. అన్ని ప్రాంతాలకు తగిన న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆందోళనలు ఆపి సంప్రదింపులకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని ఆయన సూచించారు.