బాబుకు కేసీఆర్ సవాల్, పవర్పై చేతులెత్తేసిన టీ సీఎం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమతో అభివృద్ధిలో పోటీ పడాలని, ఆ దమ్ముందా అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం సవాల్ విసిరారు. ఆచార్య జయశంకర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ పేరు పెడితే ఆంధ్రా వాళ్లకు కుళ్లు ఎందుకని ప్రశ్నించారు. జయశంకర్ తమకు గొప్పవాడు అని, అందుకే అతని పేరు పెట్టుకున్నామన్నారు.
ఇది ఆరంభం మాత్రమేనన్నారు. ఇంకా చాలా మార్చాల్సినవి ఉన్నవని చెప్పారు. మందిది తమకు వద్దని, తమది తమకు చాలన్నారు. పొద్దున లేస్తే మీతో రగడ ఎందుకన్నారు. ఆంధ్రా సీఎంకు, మంత్రులకు, నేతలకు తాను ఒకటే చెబుతున్నానని, మీ బతుకు మీరు బతకాలని, తమ బతుకు తాము బతుకుతామన్నారు. కోట్లాట అంటే తాము ఎప్పుడు సిద్ధమే అన్నారు. తెలంగాణకు ఉద్యమం కొత్త కాదన్నారు. కానీ ఇద్దరికి సమయం వృథా అన్నారు.
ఆంధ్రా సీఎం, మంత్రులు, నాయకులు పిచ్చి మాటలు మానాలని హితవు పలికారు. దమ్ముంటే చంద్రబాబు అభివృద్ధిలో పోటీ పడాలన్నారు. ఎవరి బతుకు వాళ్లం బతుకుదామన్నారు. లక్షా యాభై వేల కోట్లతో సింగపూర్ వంటి రాజధాని నిర్మించుకునే చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు.. వారి పిల్లల ఫీజులు కట్టుకోలేరా అని ప్రశ్నించారు. పిచ్చి మాటలు మానాలన్నారు.
కిషన్ రెడ్డి, పొన్నాలలపై ఫైర్
తెలంగాణ కాంగ్రెసు అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డిల పైన కేసీఆర్ ధ్వజమెత్తారు. నోరు మీకే కాదని, మాకు అంతకంటే పెద్ద నోరు ఉందన్నారు. అరవై రోజుల్లో ఏం చేయలేదని కిషన్ రెడ్డి చెబుతున్నారని, ఇంకా ముప్పై రోజులు ఏం చేయమని, తాము హడావుడిగా చేసే వారం కాదన్నారు. ఉన్న దాంట్లో అందరం తిందామంటాం తప్పితే.. హడావుడిగా వెళ్లమన్నారు. తాను అధికారుల విషయమై ఇరవై లేఖలు రాశానని చెప్పారు.
విద్యుత్ పైన ముందే చెప్పా
విద్యుత్ సమస్య పైన తాను ఎన్నికల ప్రచారం సమయంలోనే చెప్పానని కేసీఆర్ అన్నారు. వలస పాలనలో తెలంగాణ పట్ల నిర్లక్ష్యం వహించారన్నారు. పదేళ్ల కాంగ్రెసు పాలన వల్లే విద్యుత్ సమస్య అన్నారు. ఎన్నికల సమయంలోనే రైతులకు విద్యుత్ సమస్య ఉంటుందని చెప్పానని, తాను ఏం చేయలేనని చెప్పానన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు రోడ్ల పైకి రావొద్దన్నారు. మూడేళ్ల వరకు ఏం చేయలేమన్నారు.
అయితే, దానిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఉన్నట్లుగా వచ్చే ఏడాది కోతలు ఉండవన్నారు. విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కేసీఆర్ మాటగా చెబుతున్నానని... మూడో ఏడాది నుండి రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామన్నారు. తెలంగాణలో సీడ్ ప్రొడక్షన్ జరగాలన్నారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామస్తులు పంజాబ్కు విత్తనాలు సరఫరా చేస్తున్నారని తెలిసి గర్వపడ్డానన్నారు. ఆయన మన ఊరు మన కూరగాయలు పథకం ప్రారంభించారు.