చరిత్ర సృష్టించనున్న సింగరేణి.. భారీ డంపర్ ల డ్రైవర్ లుగా మహిళలు!
సింగరేణి కాలరీస్ కంపెనీ (SCCL) చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా పురుషులే ఆధిపత్యం చెలాయించిన భారీ యంత్రాల నిర్వహణలో మహిళలకు కూడా అవకాశం లభిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు తీసుకున్న ఈ నిర్ణయం మహిళల సాధికారతకు చక్కని నిదర్శనంగా కనిపిస్తుంది.
మహిళలకు భారీ డంపర్లు డ్రైవింగ్ శిక్షణ
సింగరేణి యాజమాన్యం ఇప్పటికే 13 మంది మహిళా ఉద్యోగులును ఎంపిక చేసి, సిరిసిల్లలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్లో ఉచిత శిక్షణ ఇచ్చింది. 60 నుంచి 100 టన్నుల భారీ డంపర్లను నడపడానికి అవసరమైన ట్రైనింగ్ ను వారు పూర్తి చేశారు. త్వరలోనే ఓపెన్ కాస్ట్ గనుల్లో ఈ మహిళలు డంపర్ ఆపరేటర్లుగా పని చేయనున్నారు.

సింగరేణి మహిళా సాధికారతకు కొత్త మార్గం
ఇంతకుముందు బెల్లంపల్లి ఖైరీగూడ గనిలో మహిళలతోనే బ్లాస్టింగ్ విభాగాన్ని నడుపుతున్న సింగరేణి ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది. భారీ యంత్రాల నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆడ, మగ సమానం అన్న భావనకు నిజమైన అర్థం చేకూర్చనుంది. సింగరేణి ఎండి ఎన్. సుశీల బయ్యప్ప ఈ కార్యక్రమాన్ని స్వాగతించారు. మహిళలు సాంకేతిక రంగాల్లో ముందుకు రావడం ఆధునిక తెలంగాణకు చిహ్నమని ఆమె అన్నారు.
మైనింగ్ రంగంలో మహిళల భాగస్వామ్యం
ఈ నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన దృక్పథం ఉంది. మైనింగ్ రంగంలో మహిళల భాగస్వామ్యం పెంచడం ద్వారా మహిళల ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని నిర్ణయించారు. అలాగే మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం, గ్రామీణ మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడటం, సమాజంలో లింగ ఆధిపత్యం తగ్గడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.అధికారులు త్వరలో మరింత మంది మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో నియమించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మహిళల సాధికారతకు ప్రేరణగా సింగరేణి అవకాశాలు
ఇంతకుముందు సింగరేణి మొదటి మహిళా రెస్క్యూ టీమ్ను ఏర్పాటు చేయడం ద్వారా ధైర్య సాహసాలకు ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు భారీ డంపర్ ఆపరేటర్లుగా మహిళలు ఎదగడం సింగరేణి చరిత్రలో శాశ్వత ముద్ర వేస్తుందని అంటున్నారు. ఈ కార్యక్రమం తెలంగాణలోని ఇతర రంగాల్లోనూ మహిళల సాధికారతకు ప్రేరణగా మారుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.













Click it and Unblock the Notifications