పేరు మార్పు కేటీఆర్ నుండే, కేసీఆర్పై దాడి: హరీష్కూ..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పేర్లు మార్పు విషయానికి వస్తే మొదట రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేరు మార్చాలని తెలంగాణ టీడీపీ డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమారుడు అయిన కేటీఆర్ నుండి పేరు మార్పు మొదలు పెట్టాలంటున్నారు. టీడీపీ నేత రేవంత్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొదినప్పుడు గవర్నర్ అధికారాలపై నోరు మెదపని కేసీఆర్.. సీఎంగా తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకొంటున్నారని ఆరోపించారు. 1956 స్థానికత వివాదాన్ని సృష్టించడంతో ఖమ్మం జిల్లాలోని పాల్వంచ, భద్రాచలం, మహబూబ్నగర్ జిల్లా గద్వాల్, ఆలంపూర్, కొడంగల్ మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు.
వ్యవసాయ వర్సిటీకి జయశంకర్ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే శంషాబాద్లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి పీవీ నరసింహా రావు పేరు పెట్టాలన్నారు. అసలు.. పేరు మార్పు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నుంచి మొదలు పెట్టాలన్నారు. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడడం కోసం ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న విద్యార్థులకు నాడు చేతులెత్తి మొక్కారని.. నేడు వాళ్ల కాళ్లు చేతులు విరిగేలా తంతున్నారని విమర్శించారు.
విద్యుత్ అడిగిన రైతులపై లాఠీ చార్జి జరిపిస్తున్నారన్నారు. అధికారం చేపట్టి రెండు నెలలు గడుస్తున్నా కాంట్రాక్ట్ ఉద్యోగల సర్వీసులను రెగ్యులరైజ్ చేసేందుకు విధి విధానాలు ఖరారు చేయలేదన్నారు. ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేసి పబ్బం గడుపుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సోనియా గాంధీయే విభజన బిల్లులో గవర్నర్ అధికారాలకు సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించారని.. మరి అప్పుడు ఎందుకుమాట్లాడలేదని కేసీఆర్ను నిలదీశారు.
తెలంగాణ కోసం చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పుననష్టపరిహారం అందజేస్తామని, ఇంటిలో అర్హులకు ఉద్యోగం కల్పిస్తామని చేసిన వాగ్దానాల అమలు ఎప్పుడు జరుగుతుందని ప్రశ్నించారు. 1956 స్థానికత అంశంపైనా రేవంత్ విమర్శలు కురిపించారు. 1956 స్థానికతను ప్రామాణికంగా చేసుకుని ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హులుగా నిర్ణయిస్తే, ఈ రాష్ట్రానికి సీఎం కావల్సిన వ్యక్తి 120 ఏళ్ల కిత్రం పుట్టిన వాడై ఉండాలనే డిమాండ్ను అమలుచేయాలని పేర్కొన్నారు.
విజయనగరం జిల్లా బుడ్డిపేట నుంచి వచ్చిన మీకు సీఎం అయ్యే అర్హత ఉంది కాని ఇక్కడ పుట్టి పెరిగిన విద్యార్థులు స్కాలర్షిప్లు పొందడానికి మాత్రం అర్హత లేదా అని కేసీఆర్ను ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెనక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. జేఎన్టీయూహెచ్ పరిధిలో ఉన్న 443 ఇంజనీరింగ్ కళాశాలల్లో సుమారు 292 కాలేజీలు ఒకే సామాజిక వర్గం వారివే ఉన్నాయని, ఫీజు బకాయిలు చెల్లిస్తే ఆసామాజిక వర్గం ఆర్థికంగా లాభపడి ఆధిపత్యం చెలాయిస్తారనే కక్షతో బకాయిల చెల్లింపులను నిలిపివేశారని ఆరోపించారు.
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రభుత్వ అవినీతిని ప్రజలు ప్రశ్నించకుండా ఉండడానికే సెంటిమెంట్ ముసుగులో కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. జయశంకర్ భారీ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్లో బుద్దుని పక్కన అంతెత్తులో ఏర్పాటు చేయాలన్నారు.
సంక్షేమ పధకాలను తొలగించుకునే కుట్రలో భాగంగానే సర్వే అంటున్నారని, ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై చర్యలు అంటున్నారని, నీ మాటల్లో చిత్త శుధ్ధి ఉంటే అక్రమాలపై సిద్ధిపేట నుంచి సీఐడీ విచారణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాలు వాతపెట్టినట్టు తీర్పులుచెప్పినా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవట్లేదన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుకు మంత్రి హరీశ్ రావు లేఖ రాయడంపై రేవంత్ స్పందించారు. చంద్రబాబుకు లేఖలు రాయడం కాదని, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత నీ శకుని మామ కేసీఆర్దేనని.. ఆ లేఖ ఆయనకే రాయాలని హరీశ్కు సూచించారు.