జగన్ సహా లైన్లో..: గేరు మార్చిన కెసిఆర్, మాస్టర్ ప్లాన్
హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్రలలో పోలింగ్ ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గేరు మార్చారు! తెలంగాణలో పోలింగ్కు ముందు వరకు కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగిన కెసిఆర్.. ఇప్పుడు ఆ పార్టీని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇటీవలి వరకు తెలంగాణ ప్రచారంలో కెసిఆర్ ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన విమర్శలు గుప్పించనప్పటికీ.. తెలంగాణ కాంగ్రెసు పార్టీ నేతల పైన నిప్పులు చెరిగారు. అంతేకాదు తెరాస వల్లే తెలంగాణ వచ్చిందని, కాంగ్రెసు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.

తెలంగాణ వచ్చాక కెసిఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కితాబిచ్చారు. ఆ తర్వాత ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. తమ వల్లే తెలంగాణ వచ్చిందని, కాంగ్రెసు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసే సమయం వరకు ఆయన అదే చెప్పారు.
ఇప్పుడు అనూహ్యంగా సోనియా పైన మళ్లీ పొగడ్తల వర్షం కురిపించారు. సోనియా అంటే తమకు గౌరవం ఉందని, ఆమె వల్లే తెలంగాణ వచ్చిందని ఆయన శుక్రవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మైనార్టీలను దగ్గర చేసుకునేందుకు మోడీ పైన, బిజెపి పైన కెసిఆర్ విరుచుకపడ్డారు. ఈ రోజు కూడా ఆయన అదే చెప్పారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీయేతో కలిసే ప్రసక్తి లేదని చెప్పారు.
వ్యూహాత్మకమా?
ఎన్నికల ఫలితాలకు మరో వారం రోజుల గడువు ఉంది. ఇలాంటి సమయంలో ఎన్డీయేకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశముంటే ఆయనకే మద్దతిస్తామని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇది మజ్లిస్ పార్టీని, కాంగ్రెసు పార్టీని మచ్చిక చేసుకునేందుకేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తమకు పూర్తి మెజార్టీ వస్తుందని తెరాస ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అటు ఇటు అయితే అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కొన్ని సీట్లు తక్కువ పడితే మజ్లిస్ పార్టీని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆ పార్టీని మచ్చిక చేసుకోవాలంటే ఎన్డీయేకు దూరంగా ఉంటామని చెబితేనే కుదురుతుంది. అలాగే తెలంగాణ కాంగ్రెసు పార్టీ ఆశించినన్ని సీట్లు రాకపోతే.. తెరాసకు కొన్ని సీట్లు తక్కువ పడితే.. ఆ పార్టీ అవసరం ఉండవచ్చునని ముందే భావించిన కెసిఆర్ రాహుల్ గాంధీ ప్రధాని అయితే మద్దతిస్తామని ప్రకటించి ఉండవచ్చునని అంటున్నారు.
జగన్ పైన ప్రేమ కురిపించడం వెనుక కూడా అదే ఉండవచ్చునని అంటున్నారు. సీమాంధ్రలో జగన్ పార్టీ వందకు పైగా సీట్లు గెలుచుకుంటుందని, జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో కొన్ని జిల్లాలో జగన్ పార్టీ ప్రభావం ఉంది. ఆ పార్టీ ఒకటి రెండు సీట్లు అయినా గెలుచుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ ప్లాన్డ్గా అందర్నీ లైన్లో పెడుతున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు.












Click it and Unblock the Notifications