సిఎంగా ఉన్న వ్యక్తి ప్రధాని కావడం మేలు: మోడీకి కెసిఆర్ కితాబు
హైదరాబాద్: కొద్ది కాలం క్రితం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే ప్రధానిగా ఉండటం రాష్ర్టాలకు సానుకూలమైన అంశమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. ఆ రకంగా కెసిఆర్ ప్రధాని మోడీని ప్రశంసించారు. కేంద్రప్రభుత్వ పథకాలను బాగా కుదిస్తున్నారని తెలిపారు. రాష్ర్టాలకు కేంద్రం ఇచ్చే నిధుల విధానంలో కూడా సమూల మార్పులు రానున్నాయని అధికారులకు తెలిపారు.
కేంద్రం అనేక కొత్త ఆలోచనలు చేస్తోందని, కేంద్రప్రభుత్వానికి సంబంధించి చాలా పథకాలు, కార్యక్రమాలకు తుది రూపం ఇచ్చే పనిలో అక్కడి యంత్రాంగం ఉందని ఆయన సూచించారు. కేంద్రం నుంచి వివిధ పథకాలకు సంబంధించిన వచ్చే విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలను రూపొందించుకోవాల్సి ఉందని అధికారులకు సూచనలు చేశారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చెప్పారు. ఆయన గురువారం ప్రభుత్వ అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ సమన్వయంతో పని చేస్తేనే లక్ష్యాలు సాధిస్తామని అన్నారు.
పేదలు, సంక్షేమం, పెట్టుబడులు, వ్యవసాయం విభాగాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని సిఎం కెసిఆర్ చెప్పారు. ఇందుకు అనుగుణంగానే బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వాస్తవాల ఆధారంగా పని చేయాలని సూచించారు.
అధికారులు ప్రభుత్వాన్ని నడిపే సారథులని అన్నారు. అధికారులు పరస్పరం సమాచారాన్ని పంచుకోవాలని సూచించారు. తనకు, మంత్రులకు మంచి సలహాలు ఇవ్వాలని సిఎం కెసిఆర్ కోరారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అధికారుల దగ్గర ఉండాలని అన్నారు. తెలంగాణను అధికారులే ప్రమోట్ చేయాలని అన్నారు.

హరిప్రసాద్ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయం:కేటీఆర్
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ హరిప్రసాద్ కుటుంబానికి మంత్రి కె తారకరామారావు రూ.2లక్షల ఆర్థికసాయాన్ని అందించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హరిప్రసాద్ ఇద్దరు కుమారులను చదివించే భాధ్యత తమదేనన్నారు. ప్రభుత్వం తరుపున అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీనిచ్చారు.
తెలంగాణ జర్నలిస్టులు 10 నుంచి 12వేల మంది ఉన్నారని తెలిపారు. సమగ్రమైన ప్రతిపాదనలు, సమాచారంతో వస్తే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఉద్యమంలో తామందరినీ పతాక స్థాయికి తీసుకెళ్లిన ఘనత జర్నలిస్టులదేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల రుణం తప్పకుండా తీర్చుకుంటామని మంత్రి కెటిఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications