పిచ్చాస్పత్రి నేనే కట్టానని ఒకాయన అంటాడు: బాబుపై కెసిఆర్ సెటైర్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఆర్టీసి కార్మికులకు ఫిట్మెంట్ ప్రకటిస్తూ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీపైనే కాకుండా చంద్రబాబుపై కూడా వ్యంగ్యాస్త్రాలు వేశారు.
హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కెసిఆర్ ఒక జోకు చెప్పారు. "హైదరాబాద్పై చాలా జోకులు ప్రచారంలో ఉన్నాయి, ఒకడు పిచ్చాసుపత్రిలో హైదరాబాద్ను నేనే నిర్మించాను, ప్రపంచ పఠంలో పెట్టాను అని చెబుతుంటాడు. మరో వ్యక్తి ఢిల్లీ నేనే నిర్మించాను, ముంబై నేనే కట్టాను అని కనిపించిన వారికల్లా చెబుతుంటాడు, వీరి మాటలు విన్న మరో వ్యక్తి పరవాలేదు బాధపడకండి తగ్గిపోతుంది, ఇక్కడ బాగా చికిత్స చేస్తారు" అని కెసిఆర్ అన్నారు.
మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు అందరిగురించి ఏం మాట్లాడతాం చెప్పండి! ఇదేం బాధ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు తమతో పోల్చుకోవడం అనవసరమని అన్నారు. ‘‘మాతో ఆయనకు పోలిక ఎందుకు. మాది ధనిక రాష్ట్రం. గుజరాత్, తెలంగాణ ధనిక రాష్ర్టాలని ప్లానింగ్ కమిషనే చెప్పింది. మాకే 24 గంటలు సరిపోవడంలేదు. ఆయన వ్యాఖ్యానాల గురించి ఆలోచించడంలేదు'' అని కేసీఆర్ అన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత ఎవరి పని వారు చేసుకోవాలని సూచించారు.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెరగాలని, ఇప్పుడున్నది సరిపోదని అన్నారు. ‘హైదరాబాద్ దరిద్రంగా ఉంది. ఈ మాత్రం దానికి నేను కట్టినా ఒకటే. ఎవరు కట్టినా ఒకటే' అంటూ హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితిపై పెదవి విరిచారు.
సచివాలయ మార్పు, ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మాణం, హుస్సేన్ సాగర్ను ఖాళీచేయడంపై వస్తున్న విమర్శలపై కెసిఆర్ స్పందించారు. ‘సచివాలయాన్ని చెస్ట్ ఆస్పత్రి నుంచి కంటోన్మెంట్కు మారుస్తున్నారా?' అని ఓ విలేకరి ప్రశ్నించగా... ‘చెస్ట్ ఆస్పత్రి నుంచి కంటోన్మెంట్కు మారుస్తున్నట్లు మీకు ఎవరు చెప్పారు? మీరే వార్తలు రాసి, మీరే అడుగుతారా?' అంటూ కేసీఆర్ ఎదురు ప్రశ్న వేశారు.
‘కళా భారతి కడతామంటే ఒక బాధ. పరిపాలనా వ్యవస్థ ఒకేచోట ఉండాలనే ఉద్దేశంతో సచివాలయం కడతామంటే మరో బాధ. అన్నీ అర్థంలేని విమర్శలు' అని నిరసించారు.
ఇదే సమయంలో హుస్సేన్సాగర్ ప్రక్షాళన గురించి స్పందిస్తూ -‘హుస్సేన్ సాగర్ ప్రక్షాళనను ఓ స్వయం ప్రకటిత మేధావి ఒకడు విమర్శించారు. అందులో కాలకూట విషముందన్నాడు. ఇప్పటికి మీటరున్నర నీళ్లు వదిలాం. హైదరాబాద్లో ఎవరికైనా రోగం వచ్చిందా? ఎవరైనా చనిపోయారా? అంత తెలివి లేకుండా, మూర్ఖంగా ప్రభుత్వం నీళ్లు వదులుతుందా?' అని కేసీఆర్ ప్రశ్నించారు.
స్వచ్ఛ హైదరాబాద్పైనా విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. స్వచ్ఛ హైదరాబాద్లో మంత్రులు, అధికారులు, ఉన్నతాధికారులు అందరూ ఉంటారని తెలిపారు. హైదరాబాద్ను నాలుగు వందల విభాగాలుగా గుర్తించి, స్వచ్ఛ హైదరాబాద్ చేపడుతున్నట్టు చెప్పారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచాలని దీని కోసం కార్యక్రమాలు చేపడుతుంటే విమర్శించడం తగదన్నారు.
గూగుల్ వంటి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థ హైదరాబాద్లో అతి పెద్ద క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. ఎండాకాలంలో గతంలో విద్యుత్ కోతలు ఉండేవని, తొలిసారి కోతలు లేకుండా విజయవంతంగా విద్యుత్ సరఫరా చేయగలిగినట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications