ఆంధ్ర టర్న్, ఢిల్లీలో దుకాణం: చంద్రబాబుపై కెసిఆర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఢిల్లీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పార్టీ పోలిట్బ్యూరో విస్తృత స్థాయి సమావేశానంతరం ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను పీపుల్స్ టర్న్ తీసుకున్నట్లు చెప్పిన చంద్రబాబుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు ఓ టర్న్ తీసుకున్నారో అందరికీ తెలుసునని, ఇప్పుడు చంద్రబాబు తీసుకున్నది ఎ టర్న్, ఆంధ్ర టర్న్ అని ఆయన అన్నారు.
తెలంగాణలో ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రజలు కనిపించలేదా, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు ఎక్కడ దాక్కున్నాడని ఆయన అడిగారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చంద్రబాబు దాక్కున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఢిల్లీలో శ్రీరంగనీతులు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ప్రజా జీవనం స్తంభించలేదా, తెంలగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు బయటకు కూడా రాని చంద్రబాబు ఇప్పుడు సీమాంధ్రలో పర్యటించాడని, ఢిల్లీలో దుకాణం పెట్టాడని ఆయన అన్నారు.

రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్రకు నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు చేసిన డిమాండ్ను కూడా ఆయన వ్యతిరేకించారు. కలిసి ఉండడం వల్ల తెలంగాణ నష్టపోయిందని, మహబూబ్నగర్ జిల్లాలో వలసలున్నాయని, నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్తో బాధపడుతోందని, నష్టపరిహారం తెలంగాణకు ఇవ్వాలని ఆయన అన్నారు. తెలుగుదేశం తెలంగాణ నాయకులు సిగ్గు, లజ్జ ఉంటే చంద్రబాబును వీడాలని, పాపాల భైరవుడితో ఉండి పాపాలు మూట కట్టుకోవద్దని ఆయన అన్నారు.
ఈ నెల 29వ తేదీన తెలంగాణ జెఎసి తలపెట్టిన సకల జనభేరీ సభకు కుటుంబ సభ్యులంతా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కీలకమైన సమయంలో ఈ సమావేశం జరుగుతోందని, లక్షలాదిగా ఈ సభకు తరలి రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తమకేమీ తొందర లేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆయన అన్నారు. సిడబ్ల్యుసి చేసిన తీర్మానాన్ని తుచ తప్పకుండా అమలు చేయాలని తాము కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
మోడీ ప్రయత్నించినా హైదరాబాద్కే..
ఐటిఐఆర్ను హైదరాబాద్కు ఈ రోజు ఆలోచన చేసి ఇచ్చింది కాదని కెసిఆర్ అన్నారు. దీనిపై జయప్రకాష్ నారాయణ, చంద్రబాబు వంటివారు చేసిన ప్రాంతీయ పక్షవాత వ్యాఖ్యను చూసి తాను మాట్లాడాల్సి వస్తోందని ఆయన అన్నారు. ప్రంపచ సిఇవోల సంఘం సూచన మేరకు కేంద్రం హైదరాబాదుకు దాన్ని కేటాయించారని ఆయన అన్నారు. ఐటి పెట్టుబడులకు రెండో అత్యున్నత ప్రదేశంగా ఆ సంఘం హైదరాబాదును గుర్తించిందని ఆయన అన్నారు
ఆ ప్రాజెక్టును నరేంద్ర మోడీ గుజరాత్కు తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించారని, అయినా హైదరాబాదునే వారు ఎంపిక చేసుకున్నారని ఆయన అన్నారు. అనుకూల వాతావరణం వల్ల, సకల సౌకర్యాల వల్ల ఐటిఐఆర్కు హైదరాబాదును అనువైన ప్రదేశంగా ఎంపిక చేసుకున్నారని ఆయన చెప్పారు. ఇది ఇప్పుడు చేసిన ఆలోచన కాదని, కొన్నేళ్లుగా ఆ ఆలోచన సాగుతోందని ఆయన అన్నారు.
ఐటిఐఆర్ హైదరాబాదుకు రావడం వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఏమీ లేదని ఆయన అన్నారు. ఫ్యాబ్ సిటీ వంటివాటితో వైయస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వ హయాంల్లో పేదల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ దందాలకు అవకాశం కల్పించారని ఆయన విమర్శించారు. హైదరాబాద్కు వారిద్దరు ఒరగబెట్టిందేమీ లేదని ఆయన అన్నారు. పేదల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ దందాను ప్రోత్సహించారని ఆనయ అన్నారు. జెపి వంటి నాయకుడు సంకుచిత దృష్టితో వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications