అప్పుడే ఇస్తే, విలీనం ఆషామాషీకాదు: కెసిఆర్, బాబుపై
మెదక్: తమ పార్టీని విలీనం చేస్తామని చెప్పినప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే కనీసం 400 మంది విద్యార్థులైనా బతికేవారని, కాంగ్రెసు పార్టీ ఉత్తినే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదని, వెయ్యి మంది విద్యార్థులను పొట్టన పెట్టుకుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో తమ ఆలోచనలు తమకు ఉన్నాయని చెప్పారు. ఓ పార్టీని విలీనం చేయడం ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. అందుకు రాజకీయ పరిస్థితులు కలిసి రావాలని వ్యాఖ్యానించారు. తాము విలీనం చేస్తామన్నప్పుడు తెలంగాణ ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
మెట్రో రైలు ప్రాజెక్టులో అవకతవకలు ఉన్నాయన్నారు. మెట్రోతో అమరవీరుల స్థూపం, అసెంబ్లీ దెబ్బతినే అవకాశముందన్నారు. సిద్దిపేటకు మంజూరైన రైలు మార్గాన్ని సీమాంధ్ర ఎంపీలు అడ్డుకున్నారని ఆరోపించారు. గల్ఫ్లో చిక్కుకున్న తెలంగాణ వారిని రక్షించాలని తాము ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు.
చంద్రబాబుపై ఫైర్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం బయటపడిందని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి చంద్రబాబు మంత్రుల బృందానికి(జివోఎం)కు లేఖ ఇవ్వకపోవడం దారుణమన్నారు.