నివ్వెరపోయేలా: తెలంగాణ సిఎంగా కెసిఆర్ తొలి ప్రసంగం
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం మధ్యాహ్నం పరేడ్ మైదానంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని తొలి ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలమన్నారు. అమరుల కీర్తి అజరామమన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు.
తెలంగాణ సాధనలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. సకల జనుల సమ్మె అపురూప ఘట్టమన్నారు. అది సువర్ణాక్షాలతో లిఖించదగ్గదన్నారు. తెలంగాణ ఏర్పాటు ఓ మధుర ఘట్టమన్నారు. పరేడ్ మైదానంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయనకు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడారు.
తమ ప్రభుత్వంలో రాజకీయ అవినీతికి పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం స్నేహశీలిగా ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఉంటాయన్నారు. కార్యాలయాల్లో ఆధునాతన సౌకర్యాలు ఉంటాయన్నారు. పిఆర్సీని వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. ఉద్యోగులకు త్వరలో హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. అనేక దశాబ్దాలుగా దళితులకు, మైనార్టీలకు, బిసిలకు, గిరిజనులకు తక్కువ ప్రాధాన్యత లభించిందని, వారికి పెద్ద పీట వేస్తామన్నారు. పెన్షన్లు పెంచుతామని చెప్పారు. పాలనలో పారదర్శకత పాటిస్తామన్నారు. రాబోయే ఐదేళ్లలో దళితులు, మైనార్టీలు, బిసిలు, గిరిజనుల సంక్షేమానికి లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామన్నారు. ఇందులో దళితుల సంక్షేమానికే 50వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు.
వ్యవసాయ రంగం కుంటుపడి ఉందని, దానికి తెరాస ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల భృతి ఇస్తామన్నారు. ప్రజల ఆకాంక్షను గుర్తిస్తూ పాలన చేస్తామన్నారు. విత్తనాలు పండించేందుకు అరిజోనాతో పాటు తెలంగాణనే ప్రపంచంలోనే అనువైన ప్రదేశమన్నారు. రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే హామీకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. లక్షలోపు రుణాలు ఉంటే మాఫీ చేస్తామన్నారు.
హైదరాబాదు.. ప్రపంచంలోనే గొప్ప పేరు ఉన్న నగరం అన్నారు. హైదరాబాదులో ఉన్న నిరాశ్రయులకు, పేదలకు ఇళ్లు కట్టిస్తామన్నారు. మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అంతర్జాతీయ రవాణాతో.. ప్రపంచమే నివ్వెరపోయేలా హైదరాబాదును తీర్చిదిద్దుతామని చెప్పారు. తెరాస ప్రభుత్వం శాంతిభద్రతల పట్ల నిక్కచ్చిగా ఉంటుందన్నారు. మహిళలపై జరుగుతున్న యాసిడ్ దాడుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
మహిళలపై దాడులను తెరాస ప్రభుత్వం సహించమన్నారు. ఎవరినీ కూడా తాము ఉపేక్షించమన్నారు. నగరంలో దాదాపు పదివేల సిసి కెమెరాలు ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అంతర్జాతీయస్థాయి నిఘా వ్యవస్థ ఉంటుందన్నారు. హైదరాబాదును విశ్వనగరంగా చేస్తామన్నారు. పోలీసు మిత్రులు ప్రజా మిత్రులుగా ఉండాలన్నారు. పౌల్ట్రీ, ఫార్మా రంగాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తెలంగాణలో విద్యుత్ కొరత బాధాకరమన్నారు. మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తామన్నారు.
పోలీసులకు వారానికి ఒకరోజు సెలవు ఇస్తుందన్నారు. బలహీనవర్గాలకు రెండు పడక గదుల ఇళ్లు కట్టి ఇస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధికి సలహా మండలిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజా సంఘాలు సలహాలివ్వాలన్నారు.
పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షణకు త్వరలో ఇండస్ట్రియల్ పాలసీని తెస్తామన్నారు. ఉద్యమంలో ఎలాంటి ఐకమత్యం ప్రదర్శించామో.. అభివృద్ధిలోను అదే ఐక్యమత్యంతో ముందుకెళ్దామన్నారు. తెరాస ప్రభుత్వం కేంద్రంతో, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కలిగి ఉంటుందన్నారు. ప్రసంగం చివరలో వేదవ్యాసుడు రాసిన శ్లోకాన్ని చదివి వినిపించారు.