కెసిఆర్కు సిగ్గు లేదా: కెఈ, హరిత పథకంపై చంద్రబాబు
కర్నూలు/ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మరోసారి మండిపడ్డారు. హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి అసలు ఆదాయమే లేదని అన్నారు. హైదరాబాద్లో ఈ రోజున రెవిన్యూ దాదాపు 65 శాతం ఇస్తున్నామని ఆయన చెప్పారు. తమ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రోడ్లు అభివృద్ధి చేశామని, రింగ్రోడ్లు కట్టించామని, ఎరోడ్రమ్లను నిర్మించామని కేఈ తెలిపారు. ఇప్పుడు కేసీఆర్ ఇదంతా మాది అని చెప్పుకోడానికి సిగ్గుగా లేదా? అని ఆయన ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి జరగలేదన్న కెసిఆర్ వ్యాఖ్యలపై కేఈ అభ్యంతరం తెలిపారు. ఇతరులపై విమర్శలు చేయడం మాని రైతుల ఆత్మహత్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని కేఈ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా తుంగభద్రా నదిలో ఇసుక రీచ్లను శుక్రవారం కేఈ కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
హరిత ప్రాజెక్టుపై బాబు సమీక్ష

హరిత ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు లక్ష్యాలను ఆయన వివరించారు. భూసార పరీక్షలు నిర్వహించి జియో మ్యాపింగ్ టెక్నాలజీ ద్వారా నీటి మట్టాలను గుర్తించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. నీటి ఎద్దడి సమయంలో నీళ్లను పొదుపుగా వాడాలని అన్నారు.
వ్యవసాయంలో ఆధునిక పరికరాలు ఉపయోగించేలా ప్రజల్లో చైతన్యం తేవాలని, 30 వేల మంది రైతులకు ప్రయోజనం కలిగేలా రూ. 30 కోట్లతో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని అధికారులకు చంద్రబాబు నాయుడు సూచించారు. హరిత పేరిట ఆ పథకాన్ని మూడు జిల్లాల్లోని ఐదు మండలాల్లో ఉన్న 20 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ప్రారభిస్తారు.
30 వేల మంది రైతులను ఇందులో భాగస్వాములను చేసి భూములను సస్యశ్యామలం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. నీటిపారుదల, రెవెన్యూ, వ్యవసాయ శాఖలను సమన్వయం చేసి వారి సేవలను రైతులకు ఈ పథకం కింద అందిస్తారు.












Click it and Unblock the Notifications