ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి: పార్టీ కంటే కులమే ముఖ్యమన్న కేఈ
అమరావతి: గౌడ కులస్తులందరూ ఐక్యంగా ఉంటే అభివృద్ధి చెందుతారని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గౌడ సంక్షేమ సంఘం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం ఒంగోలులో నిర్వహించారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి హాజరైన ఆయన పార్టీ కంటే పార్టీ కంటే కులమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుపై శనివారం జరిగిన చర్చలో ఏపీకి అవమానం జరిగిందని నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు విజయవాడలో ఆదివారం ఎంపీలతో సమావేశం నిర్వహించారని చెప్పారు.
ఈ సమావేశంలో టీడీపీ మిత్రపక్షం కావడంతో ఏపీకి ఎక్కవ సాయం చేయలేమన్నట్టుగా ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొనడాన్ని చంద్రబాబు తప్పుబట్టారని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్లో జైట్లీ ఇచ్చిన సమాధానం ఆమోదయోగ్యం కాదని చెప్పారని, ఎంపీలంతా ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని ఆర్ధికలోటులో ఉన్న ఏపీ పరిస్థితిని ఆయనకు వివరించాలని సూచించినట్టు తెలిపారు.
దీంతో పాటు ఏపీకి ప్రత్యేకహోదా ఎంత అవసరమో ప్రధాని వివరించాలని, దాని సాధనకు కృషి చేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్టు డిప్యూటీ సీఎం కేఈ తెలిపారు. ప్రధాని మోడీ టీడీపీ ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వకపొతే పార్లమెంట్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడాలని చెప్పారన్నారు.