ఏపీ సాగు విధానాలు భేష్ అన్న కేరళ .. అధ్యయనం కోసం కేరళ మంత్రి ఏపీకి వచ్చారన్న విజయసాయి రెడ్డి
ఏపీ వైసిపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలపై ఇప్పుడు భారతదేశం దృష్టి పడిందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. రైతు భరోసా పథకం అద్భుతమైన పథకమని కేరళ ప్రభుత్వం ప్రశంసించిందని వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇక కేరళ రాష్ట్రం కూడా ఏపీ బాట పడుతుంది అంటూ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.
ఏపీ సాగు విధానాలపై కేరళ దృష్టి .. అందుకే కేరళ వ్యవసాయ మంత్రి ఏపీకి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సాగు విధానాలపై కేరళ ఆసక్తి కనబరుస్తుందని చెప్పిన సాయిరెడ్డి, అందుకే ఏపీ విధానాలపై అధ్యయనం చేయడానికి కేరళ ప్రభుత్వం వ్యవసాయ మంత్రిని పంపిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కేరళ బృందాలు ఇప్పటికే గ్రామాల్లో ఆర్బికే పనితీరును స్టడీ చేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో అనేక రంగాలలో ఏపీ సాధిస్తున్న ప్రగతి వివిధ రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తుందని వెల్లడించారు. ఒకప్పుడు సాగు విధానాలపై ఏపీ అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారని, కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారు మన దగ్గరికి వస్తున్నారు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు .

నూతన విత్తన విధానం తీసుకొచ్చిన ఏపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు, వ్యవసాయ విధానాలు ఇతర రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేస్తూ ఉన్నాయంటూ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో తొలిసారిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం నూతన విత్తన విధానాన్ని తీసుకొచ్చిందని చెప్పిన విజయసాయిరెడ్డి భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా జన్యుపరంగా అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాలను, ధృవీకరించిన విత్తనాలను సకాలంలో రైతులకు అందజేయడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు వెల్లడించారు.
రైతుకు విత్తన భరోసా .. ఏం చేస్తారో చెప్పిన సాయి రెడ్డి
రైతుకు విత్తన భరోసా కల్పించే ఈ పాలసీలో 1000 గ్రామాలలో ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామని హైబ్రిడ్ విత్తన తయారీ జరగనుందని వెల్లడించారు. వందేళ్ల నాటి విత్తనాలతో వాతావరణ అనుకూల వంగడాల అభివృద్ధి జరుగుతుందని, వర్సిటీలు అభివృద్ధి చేసిన బ్రీడర్ సీడ్ నుండి మూల విత్తనోత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. 50 కోట్లతో విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై సాయి రెడ్డి ట్వీట్లు
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్న విజయసాయిరెడ్డి క్యూబా మాదిరిగా వైద్య రంగంలో విప్లవం సృష్టించామని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను తీసుకువచ్చామని పేర్కొన్నారు. రైతులకు సర్వం సమకూర్చుతూ యుఎన్ఓ దృష్టిని ఆకర్షించిన ఆర్బికేలు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి సగానికిపైగా పదవులలో మహిళా సాధికారత సాధిస్తున్నారు అని, పేదలకు 31 లక్షల ఇళ్లు ఇస్తే, ప్రతిపక్షాలు ఓర్వ లేక పోతున్నాయని ట్వీట్ చేశారు. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం సాధించిన విజయాలను, అమలు చేస్తున్న పథకాలను మాత్రమే ప్రచారం చేస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డి జగన్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, దేశం దృష్టి రాష్ట్రంపై ఉందని పదేపదే చెప్తున్నారు.












Click it and Unblock the Notifications