రఘురామ ఇష్యూ: ఎంపీపై థర్డ్ డిగ్రీ పార్లమెంట్కే అవమానమంటూ కేరళ ఎంపీ ప్రేమచంద్రన్
అమరావతి: ఏపీ సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో తనను కొట్టారని, థర్డ్ డిగ్రీ ఉపయోగించారని వైయస్సార్సీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు జాతీయ మానవ హక్కుల సంఘానికి, పార్లమెంటుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, పలువురు ప్రముఖులకు కూడా లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకు పలువురు సహచర ఎంపీలు, నేతలు మద్దతుగా నిలుస్తున్నారు.
తాజాగా, కేరళ ఎంపీ ప్రేమ్చంద్రన్ స్పందించారు. పార్లమెంటు సభ్యుడైన రఘురామపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని అన్నారు. ఏపీ సీఐడీ తీరును ఆయన ఖండించారు. ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజును కొట్టడమంటే పార్లమెంటును అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని పార్లమెంటులో తప్పకుండా లేవనెత్తుతానన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ మే నెలలో ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. ఇక్కడ పోలీస్ కస్టడీలో ఉంచి ఆయనను విచారించారు. ఎంపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. మంజూరు కాకపోవడంతో రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
అయితే, కస్టడీలో ఉండగా తనను పోలీసులు, కొట్టారని గుంటూరు జిల్లా న్యాయమూర్తికి వివరించడంతో వైద్య పరీక్షలు సైతం చేసిన వైద్య బృందం కోర్టుకు నివేదికను అందజేసింది. సికింద్రాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందిన రఘురామ.. డిశ్చార్జ్ అయిన వెంటనే నేరుగా ఢిల్లీలోకి వెళ్లారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి జరిగిన పరిణామాలను వివరించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తనను తీవ్రంగా కొట్టారంటూ మానవ హక్కుల సంఘంకు కూడా ఫిర్యాదు చేశారు.