ఎమ్మెల్యే కిడారి, సోమలను హత్య చేసిన కీలక మావోయిస్ట్ దుబాసి శంకర్ అరెస్ట్ .. మావోయిస్ట్ పార్టీలో కలవరం !!
మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మర్డర్ కేసులో కీలక నిందితుడైన మావోయిస్టు కమాండర్ ను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం ముత్త రాశి చెట్లకు చెందిన దుబాసి శంకర్ అలియాస్ రమేష్ అలియాస్ అరుణ్ ను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేయడం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. మావోయిస్టు పార్టీలో కీలకంగా ఉన్న ఈ నేత అరెస్టుతో ఇటీవల ఉనికిని చాటుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్న మావోయిస్టు పార్టీ సంక్షోభంలో పడింది.
మావోయిస్ట్ పార్టీ కీలక నేత దుబాసి శంకర్ అరెస్ట్
ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్లోని భద్రతా దళాలపై వరుస దాడులకు పాల్పడినట్లు భావిస్తున్న మావోయిస్టు క్యాడర్ను సోమవారం బోయిపరిగూడలోని పేటగూడ సమీపంలోని అటవీప్రాంతంలో అరెస్టు చేశారు. అతనిపై తెలుగు రాష్ట్రాలతోపాటు, ఒడిశా రాష్ట్ర పోలీసు బలగాలు కనీసం 76 కేసులను నమోదు చేశాయి. నిర్దిష్ట సమాచారం ఆధారంగా, కోరాపుట్ డివిఎఫ్, ఎస్ఓజి మరియు బిఎస్ఎఫ్తో కూడిన బృందాలు అడవిలో గాలింపు చేస్తున్న క్రమంలో మావోయిస్టు కీలక నేత దుబాసి శంకర్ను పట్టుకున్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన అనేక దాడుల ఘటనలో కీలకంగా వ్యవహరించిన ఇతనిపై 20 లక్షల రివార్డ్ ఉంది.
దుబాసి శంకర్ పై 74 కేసులు
ఒడిశా పోలీసులు అరెస్ట్ చేసిన అతని వద్ద నుంచి ఒక ఇన్సాస్ రైఫిల్, 10 రౌండ్ల మందుగుండు సామగ్రి, మొబైల్ ఫోన్, రేడియో సెట్ మరియు 35,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. దుబాసి శంకర్ పై కోరాపుట్లో రెండు, మల్కన్గిరిలో 18, ఏపీలోని విశాఖపట్నంలో 32 మరియు తెలంగాణలో 24 కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత 20 ఏళ్లలో ఇప్పటివరకు రాష్ట్రంలో పట్టుబడిన అతిపెద్ద మావోయిస్టు క్యాడర్ దుబాయ్ శంకర్ అని భావిస్తున్నారు.
అనేక దాడుల ఘటనలలో కీలకంగా దుబాసి శంకర్
ఇక విచారణ సమయంలో, మావోయిస్ట్ దుబాసి శంకర్ 2009 లో దమంజోడి ఎదురు కాల్పుల ఘటనలో పాల్గొన్నాడని, ఇందులో 10 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బంది మరణించారని వెల్లడించాడు. అంతేకాకుండా, 2012 లో మల్కన్ గిరి చిత్రకొండలో కమాండెంట్తో సహా నలుగురు బిఎస్ఎఫ్ జవాన్లు మరణించిన జానీగూడ ఆకస్మిక దాడిలో ఆయన కీలకంగా వ్యవహరించారని వెల్లడించారు. 2010, ఏప్రిల్లో బోయిపరిగూడలో 11 మంది పోలీసులు మరణించిన గోవిందపాలి మందుపాతర పేలుడులో కూడా ఇతను కీలక పాత్ర పోషించారు.
ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యకేసులో శంకర్ పై ఎన్ఐఏ కేసు
ఒడిశా మరియు ఏపీలో భద్రతా సిబ్బందితో జరిగిన అనేక ఎన్కౌంటర్లలో దుబాసి శంకర్ భాగమని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య కేసులో దుబాసి శంకర్ పై ఎన్ఐఏ కేసు నమోదైనట్లుగా చెప్తున్నారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (AOBSZC) సభ్యుడు, దుబాసి శంకర్ అలియాస్ రమేష్ అనేక మంది భద్రతా సిబ్బంది హత్యలలో పాల్గొన్నాడు. మావోయిస్టు పార్టీలో 1987 నుండి ఇప్పటివరకు కీలకంగా వ్యవహరించిన రమేష్ పట్టుబడటం మావోయిస్టు పార్టీకి మింగుడు పడడం లేదు.
1987 లో మావోయిస్ట్ పార్టీలో చేరిన దుబాసి శంకర్ .. పార్టీలో కీలకంగా
దుబాసి శంకర్ 1987 లో మావోయిస్టు గ్రూపులో తెలంగాణాలో ఇంద్రపురియల్ ఏరియా కమిటీ కింద పార్టీ సభ్యునిగా చేరాడు . 2003 లో ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడిగా ఎదిగారు. అతను 2004 లో ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (AOBSZC) లో చేరాడు. 2010 లో దుబాసి శంకర్ స్టేట్ మిలిటరీ కమిషన్లో చేరాడు . ఒడిశా,ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో పార్టీ కార్యక్రమాలలో, దాడులలో చురుకుగా పాల్గొన్నాడు. ఇక దుబాసి శంకర్ ను మంగళవారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ కోసం ఆయనను ఐదు రోజుల రిమాండ్కు పోలీసులు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కోరాపుట్ ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయిన మరో మావోయిస్ట్ మాద్వి, అలియాస్ కిరణ్
ఆ తర్వాత జరిగిన పరిణామాలలో మరొక మావోయిస్టు పార్టీ సభ్యుడు మంగళవారం కోరాపుట్ ఎస్పీ కార్యాలయంలో నైరుతి డిఐజి రాజేష్ పండిట్ ముందు లొంగిపోయారు. అతడిని సోనాల్ మాద్వి అలియాస్ కిరణ్, ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కింద గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పమేడ్లోని మెద్దగూడ గ్రామానికి చెందిన కిరణ్ 2012 లో నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) లో చేరారు. అతను 2016 లో మల్కన్ గిరిలో రామగుడ కాల్పుల్లో పాల్గొన్నాడు. ఇందులో 31 మంది మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై ఎదురు కాల్పులకు దిగారు.
మల్కన్ గిరి రామగుడ క్కాల్పుల్లొ కీలక భూమిక పోషించిన మాద్వి
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పమేడ్లోని మెద్దగూడ గ్రామానికి చెందిన కిరణ్ 2012 లో నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) లో చేరారు. అతను 2016 లో మల్కన్ గిరిలో రామగుడ కాల్పుల్లో పాల్గొన్నాడు, ఇందులో 31 మంది మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై ఎదురు కాల్పులకు దిగారు. ఇక కీలకమైన యాక్టివిటీస్ లలో పాల్గొనే పార్టీ సభ్యులు అరెస్ట్ , లొంగుబాట్లు మావోయిస్టు పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. మావోయిస్టు పార్టీ నేతల అరెస్టులు, లొంగిపోతున్న ఘటనలతో అగ్ర నేతల్లో కలవరం పెరిగిపోతోంది.
కీలక నేతల అరెస్ట్ లు, లొంగుబాట్లతో పార్టీ కి పెద్ద దెబ్బ ..
ఒకవైపు రిక్రూట్మెంట్ లేకపోవడం, మరోవైపు కీలక నేతలు కొందరు కరోనా మహమ్మారికి బలికావడం, మరికొందరు లొంగిపోవడం, ఇంకొందరు పోలీసులకు పట్టుబడటం వంటి ఘటనలు ఎన్నడూ లేనంతగా మావోయిస్టు పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇప్పటివరకు పోలీసులకు లొంగిపోయిన వారు, పట్టుబడిన వారు కీలక నేతలు కావడంతో పార్టీని ముందుకు నడిపించడం ఎలాగో అర్థంకాని పరిస్థితిలో మావోయిస్టు పార్టీ సతమతమవుతోంది.
Recommended Video
తాజా పరిణామాలతో తీవ్ర కలవరంలో మావోయిస్టులు
గత రెండేళ్ల కాలంలో మావోయిస్టు పార్టీ నుండి కీలక నేతలు లొంగిపోవడం పెద్ద ఎత్తున జరగడం, కరోనా మహమ్మారి కారణంగా మావోయిస్టులు అనారోగ్యం బారిన పడి ఇబ్బంది పడటం వంటి అనేక కారణాలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిణామాలు మావోయిస్ట్ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. మావోయిస్టు పార్టీ నేతల అరెస్టులు, లొంగిపోతున్న ఘటనలతో అగ్ర నేతల్లో కలవరం పెరిగిపోతోంది. ఒకవైపు రిక్రూట్మెంట్ లేకపోవడం, మరోవైపు కీలక నేతలు కొందరు కరోనా మహమ్మారి కి బలికావడం, మరికొందరు లొంగిపోవడం, ఇంకొందరు పోలీసులకు పట్టుబడటం వంటి ఘటనలు ఎన్నడూ లేనంతగా మావోయిస్టు పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.