వైసీపీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీపార్వతి, జగన్ ఆర్డర్తో
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నందమూరి లక్ష్మీపార్వతి నియమితులయ్యారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మరణానంతరం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారు. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుంచి 1996లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అయితే ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పని చేస్తున్నారని గతంలో ఆమె అనేక పర్యాయాలు పేర్కొన్నారు.
జగన్, విజయమ్మలు వివిధ సమస్యలు, అంశాలపై ధర్నాలు, నిరసన దీక్షలు నిర్వహించినప్పుడూ లక్ష్మీపార్వతి హాజరయ్యారు. ఇలా ఉండగా బుధవారం జగన్ ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం (పిఎసి) సభ్యునిగా పి రవీంద్రనాథ్ రెడ్డిని, పార్టీ కార్యదర్శిగా వి అశోక్ బాబును నియమించినట్లు ఆ ప్రకటన పేర్కొంది. జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిపారు.