లగడపాటి మాట: రాజీనామా వైపే కిరణ్ రెడ్డి మొగ్గు?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకున్నారని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రే ప్రకటిస్తారని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ముఖ్యమంత్రితో సోమవారం సాయంత్రం భేటీ అయిన ఆయన మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు రాజీనామా చేయవద్దని తాను చెప్పినట్లు కూడా ఆయన అన్నారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం రాజీనామా చేయడానికే సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఆయన రాజీనామా చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన స్థితిలో రాజీనామా చేయాలనే ఉద్దేశంతోనే కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సోమవారం తనకు అత్యంత సన్నిహితులైన కొందరు మంత్రులు, శాసనసభ్యులు, కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరిపారు. పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వారికి ముఖ్యమంత్రి సూచనప్రాయంగా తెలియజేశారని సమాచారం.

ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగానే సోమవారం గవర్నర్ను కలవడం వెనక కూడా అదే వ్యూహం ఉన్నట్లు చెబుతున్నారు. విభజన వ్యవహారం తనకు నచ్చలేదనే రీతిలో నరసింహన్తో ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. శాసనసభ తిరస్కరించిన బిల్లుకు రాష్టప్రతి ఆమోదముద్ర వేయడం కూడా ముఖ్యమంత్రికి నచ్చలేదని అంటున్నారు.
గత నాలుగు రోజులుగా పదవిపై తనకు మమకారం లేదనే సంకేతాలను ఇస్తూ వస్తున్న ముఖ్యమంత్రి మరోవైపు ఇందుకు సంబంధించి రంగం సిద్ధం చేసుకున్నారు. రాష్టప్రతి నిర్ణయంతో నిర్ఘాంత పోయిన ముఖ్యమంత్రి మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు.
కాగా రాజీనామాకు ముహూర్తం దగ్గర పడుతున్నట్టుగా జరుగుతున్న ప్రచా రం నేపథ్యంలో ముఖ్యమంత్రి శిబిరంలో నిరాశానిస్పృహలు చోటు చేసుకున్నా యని అంటున్నారు. ఒకవేళ రాజీనామా చేసిన ఏ విధంగా చేయాలో తేల్చుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి వున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications