కిరణ్ రెడ్డి హోమ్ కమింగ్, ఎందుకు: రాహుల్ గాంధీతో భేటీ
కిరణ్ రెడ్డి తిరిగి కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెసుకు జవజీవాలు ఇచ్చి ప్రధాన నాయకుడిగా ముందుకు రావాలని ఆయన యోచనగా చెబుతున్నారు.
విజయవాడ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సొంత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ఏ మాత్రం ఆయన ప్రభావం చూపలేకపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
అయితే, ఆయన చివరకు కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఆయన కాంగ్రెసు నేత రాహుల్ గాంధీతో చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన పవన్ కల్యాన్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెబుతారు. ఆ తర్వాత బిజెపిలో చేరడానికి కూడా ఆయన ప్రయత్నాలు చేసినట్లు చెబుతారు.
తన సమైక్యాంధ్ర పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన బెంగళూరు వెళ్లిపోయారు. చివరకు ఏ పార్టీలోనూ చేరలేక తిరిగి కాంగ్రెసు గూటికే రావాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వెంటలేటర్ మీద ఉండడమే ఆయన నిర్ణయానికి కారణమని చెబుతున్నారు.
కాంగ్రెసును పునరుద్ధరించి, నాయకుడిగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆయన కాంగ్రెసులో చేరడం దాదాపుగా ఖాయమైనట్లు చెబుతున్నారు.