చిరు హాస్యనటుడిలా మాట్లాడుతున్నారు: కిరణ్ రెడ్డి
విజయవాడ: కాంగ్రెసు నాయకుడు, కేంద్ర మంత్రి చిరంజీవి హాస్యనటుడిలా మాట్లాడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనకు తాను కారణమంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. రాష్ట్ర విభజనకు తాను ఎలా కారణమవుతానని ఆయన అడిగారు.
తాను ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఉన్నానో కూడా చిరంజీవికి తెలియదని, 2010లో తాను ముఖ్యమంత్రిగా లేనని ఆయన అన్నారు. రాజకీయాల్లో తెలిస్తే మాట్లాడాలి, లేదంటే గమ్మున ఉండాలని ఆయన అన్నారు. చిరంజీవి మాటలు అజ్ఞానమని ఆయన అన్నారు. చిరంజీవి మాటలను బట్టి రాజకీయ పరిజ్ఝానం ఎంత ఉందో అర్థమవుతోందని ఆయన అన్నారు. విభజనకు తాను కారణమంటే వారి జ్ఝానానికి వదిలేస్తున్నానని ఆయన చెప్పారు.
శాసనసభ సమావేశాలకు ముందు తెలంగాణకు ప్యాకేజీ ఇస్తామంటే కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించలేదని, దాని వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని చిరంజీవి అన్నారు. దీనిపై కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిస్పందిస్తూ - ఏ నిర్ణయం తీసుకుంటామనే విషయాన్ని కాంగ్రెసు అధిష్టానం తనకు చెప్పలేదని, శాసనసభ సమావేశాల తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని తాను సూచించానని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా తాను కాంగ్రెసు అధిష్టానం వద్ద ఏనాడూ వ్యవహరించలేదని, తాను విభజనకు వ్యతిరేకమని ముఖ్యమంత్రిని కావడానికి ముందు కూడా చెప్పానని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కారణమని ఆయన విమర్శించారు. విభజనపై జగన్ యూటర్న్ తీసుకున్నారని, చంద్రబాబు ఏం చెప్పాడో తనకైతే అర్థం కాలేదని ఆయన అన్నారు. విభజన బిల్లు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలుగుజాతిని అవమానపరిచిందని ఆయన అన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ తాను పార్టీ పెట్టినట్లు ఆయన తెలిపారు.