మీకే ప్రమాదకరం: మజ్లిస్పై కిషన్, నా మంచికే: కేసీఆర్
హైదరాబాద్: మజ్లిస్ పార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితికి పొత్తు ప్రమాదకరమని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం హెచ్చరించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తున్నారన్నారు. విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్గడ్ వెళ్లేందుకు ఆరు నెలలు ఎందుకు పట్టిందన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలే ఆయన ప్రభుత్వాన్ని కూలదోస్తాయన్నారు.
కాగా, అంతకుముందు శాసన సభ వాయిదా పడకముందు.. సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యల పైన స్పందించారు. సభా నాయకుడికి ఓర్పు, సహనం, హుందాతనం ఉండాలని మల్లు భట్టి వ్యాఖ్యానించారు.

దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. తెలంగాణ శాసనసభా నాయకుడిగా సంయమనం పాటించేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తానని చెప్పారు. భట్టి మంచి సూచన ఇచ్చారని, అలాంటి సూచనలను తీసుకునేందుకు తాము సిద్ధమన్నారు. నాకే మంచి చెప్పారని, పాటిస్తానని అన్న కేసీఆర్.. తన మనసు గాయపడినందువల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని, అంతే తప్ప మరొక ఉద్దేశ్యం కాదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు సభలో నవ్వులను పూయించాయి.
ఇదిలా ఉండగా.. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగాల్లో 1,07,744 ఖాళీలు ఉన్నాయని చెప్పిన కేసీఆర్... త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని అన్నారు. నిరుద్యోగులకు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తామన్నారు. ఐదేళ్ల సడలింపు కల్పిస్తామని, 4 లేక 5 నెలల్లో ఉద్యోగాల జాతర మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు.
కమల్ నాథన్ కమిటీ ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తిచేస్తే, ఎంతమంది తెలంగాణలో ఉంటారో? ఎంత మంది పోతారో తెలుస్తుందని ఆయన వివరించారు. విద్యుత్ శాఖ ఖాళీల భర్తీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందికే ప్రాధాన్యత ఇస్తామన్నారు.












Click it and Unblock the Notifications