కామినేనీ! నోరు అదుపులో పెట్టుకో: పార్థసారథి, కొడాలి నాని హెచ్చరిక
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొలుసు పార్థసారథి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని మంత్రికి హితవు పలికారు.
గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం సమాయత్తంలో భాగంగా కైకలూరులో బుధవారం నిర్వహించిన సమావేశంలో పార్థసారథి, నాని మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు మెప్పుకోసం తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఇష్టానుసారం విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
జగన్మోహన్ రెడ్డిపై నోరుపారేసుకుంటే మంత్రి కామినేని కంటే వయసులో చిన్నవాడినైన తాను కైకలూరు నడిరోడ్డుపై ఆయన్ని తిట్టాల్సి వస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కామినేని మళ్లీ సీటు తెచ్చుకున్నా.. కైకలూరులో గెలిచేది మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు.
దేశంలో ఎక్కడైనా అనారోగ్యంతో మరణించిన శిశువులను చూశాం కానీ, ఈ రాష్ట్రంలో మాత్రం చీమలు, ఎలుకలు కరిచి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు. ఈ ఘటనలకు మంత్రి కామినేనిదే బాధ్యత అని అన్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి ఉదయభాను మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో గాలివాటున కామినేని గెలిచారని, వచ్చే ఎన్నికల్లో అలా జరగదని అన్నారు.