ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడనే: తేల్చేసిన కోడెల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు తేల్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడనే అవుతుందని ఆయన ఆయన చెప్పేశారు. విజయవాడలోని పోరంకి వద్ద కామినేని ఆస్పత్రి నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన ఎపి రాజధానిపై మాట్లాడారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను దశలవారీగా విజయవాడకు తరలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇదివరకే సూచించారు.
కాగా, శుక్రవారం కర్నూలులో మాట్లాడుతూ కూడా చంద్రబాబు సూచనప్రాయంగా అదే విషయం చెప్పారు. ప్రకాశం జిల్లా దొనకొండ భూములు తప్ప ఏమీ లేవని, అందువల్ల అక్కడ రాజధాని కుదరదని ఆయన అన్నారు. అలాగే, కర్నూలులో కూడా రాజధాని ఏర్పాటు చేసే అవకాశం లేదని ఆయన తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చెప్పారు.
విజయవాడలోని గన్నవరం మేధా టవర్స్నే ఆయన తన కార్యాలయానికి ఎంపిక చేసుకున్నట్లు అర్థమవుతోంది. పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు కూడా ఇప్పటికే తమ క్యాంపు కార్యాలయాలను విజయవాడలో ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు అందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.