కోనసీమ అల్లర్లు.. మంత్రి విశ్వరూప్ అనుచరులపై కేసులు నమోదు; డీజీపీ ఏం చెప్పారంటే!!
కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ మే 24వ తేదీన అమలాపురంలో పెద్ద ఎత్తున అలజడి చెలరేగిన విషయం తెలిసిందే. కోనసీమ జిల్లా పేరు విషయంలో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు. అంతేకాదు పోలీసులపై కూడా రాళ్లు రువ్వి దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ పోలీసులు ఈ అల్లర్లకు సంబంధించిన పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
తాజాగా అమలాపురం అల్లర్ల కేసులో పోలీసులు మంత్రి పినిపే విశ్వరూప్ అనుచరులుగా ఉన్న నలుగురిపై కేసులు నమోదు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు సత్య రుషి, మురళీకృష్ణ, సుభాష్, రఘు ల పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయాన్ని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. కోనసీమ అల్లర్ల కేసులో మంత్రి విశ్వరూప్ అనుచరులను నిందితులుగా కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. ఏ 225గా సత్య రుషి, ఏ 226గా సుభాష్, ఏ 227గా మురళీకృష్ణ, ఏ 228గా రఘు లను చేర్చారు.
ఏ222 గా ఉన్న సత్యప్రసాద్ వాంగ్మూలంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కోనసీమ అల్లర్లలో ఇప్పటివరకు 258 మంది ఉన్నట్టు గుర్తించామని,వారిలో 142 మందిని అరెస్ట్ చేశామని, మరో 116 మంది కోసం ఏడు ప్రత్య్తేక బృందాలు గాలింపు చేపట్టాయని పేర్కొన్నారు. నిందితులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని వెల్లడించారు. నిందితులు అమలాపురంలో జరిగిన అల్లర్లకు రెండింతలు మూల్యం చెల్లించాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.
ఇక కోనసీమ అల్లర్లలో వైసీపీ నాయకులు కూడా ఉండటం రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు కోనసీమ అల్లర్ల విషయంలో టార్గెట్ చేసుకున్నారు. కోనసీమ అల్లర్లు రాజకీయ కుట్ర అని అభివర్ణించారు. ఇక ఈ అల్లర్ల కేసులో పోలీసులు ఎవరినీ వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్తున్నారు.