కోనసీమ అల్లర్లపై తీవ్రంగా స్పందించిన మంత్రి రోజా: పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై నిప్పులు
అమరావతి: కోనసీమ అల్లర్ల విషయంలో అధికార, ప్రతిపక్షాల నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులు ప్రతిపక్ష పార్టీల నేతలపై విమర్శలు గుప్పించగా. తాజాగా మంత్రి రోజా కూడా తీవ్రంగా స్పందించారు. కోనసీమ అల్లర్ల ఘటనకు కారకులైన వారిని విడిచిపెట్టేది లేదని రోజా హెచ్చరించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే ఎందుకు గొడవ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇవే ప్రతిపక్షాలు గతంలో అంబేద్కర్ పేరు పెట్టాలని నిరాహార దీక్షలు చేశారన్నారు.
కోనసీమ అల్లర్ల కుట్రదారుల్ని బయటికి లాగుతామన్న రోజా
రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను తగలబెట్టడం బాధాకరమని రోజా వ్యాఖ్యానించారు. దాడి చేసిన వారిలో 50 మందిని అరెస్ట్ చేశామన్నారు రోజా. ఈ ఘటనలపై కేసు విచారణ జరుగుతోందన్నారు. వైసీపీ పాలనపై బురదజల్లేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని రోజా ఆరోపించారు. అంబేద్కర్ కారణంగానే మనమంతా క్షేమంగా ఉన్నామని, అలాంటి మహావ్యక్తి పేరు పెడితే గొడవలు చేయడం ఏంటని మంత్రి రోజా ప్రశ్నించారు. కుట్ర వెనుక ఎవరున్నారో బయటికి లాగుతామని తేల్చి చెప్పారు.
బాబు చెప్పిందే పవన్ కళ్యాణ్ చదువుతున్నారు: రోజా
కోనసీమ పేరు మార్చాలంటూ సూసైడ్ చేసుకుంటామంటూ టీవీల ముందుకు వచ్చినవారు.. పవన్ కళ్యాణ్తో ఎంత క్లోజ్గా ఉన్నారో తెలుస్తోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చదువుతున్నారన్నారు. పవన్ ప్యాకేజీ తీసుకున్నారని మంత్రి రోజా ఆరోపించారు.
జగన్ ఇక్కడ లేరనే కుట్రలు చేస్తున్నారన్న రోజా
అప్పట్లో తుని ఘటనలో వైసీపీ వాళ్లుంటే మీ పాలనలో ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని రోజా నిలదీశారు. కోనసీమలో ప్రజలు భయపడాల్సిన పనిలేదని, ధైర్యంగా ఉండాలని అన్నారు. పోలీసులకు దెబ్బలు తగిలినా కష్టపడి పనిచేశారన్నారు. ప్రతిపక్షాలు ఓట్ల కోసం వస్తే వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో లేరని ఇలాంటి కుట్రలు చేస్తే కుదరదని, ఆయన ఎక్కడ ఉన్నా.. ఆ చూపంతా ఏపీలోనే ఉంటుందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.కాగా, మంగళవారం మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టిన విషయం తెలిసిందే. వారి వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఆందోళనకారుల దాడిలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు ఆంక్షలు విధించారు. బుధవారం కూడా నిరసనలు కొనసాగాయి.