రోడ్డు ప్రమాదంలో కోరంగి ఎస్సై మృతి, సంతాపం తెలిపిన చినరాజప్ప
కాకినాడ: విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న ఎస్సై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి దాటాక కాకినాడ పట్టణంలోని ఏడీబీ రోడ్డు అచ్చంపేట జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
కోరంగి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ కుమార్ మంగళవారం అర్ధరాత్రి డ్యూటీ ముగించుకొని బైక్పై ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో అచ్చంపేట జంక్షన్లోని ఏడీబీ రోడ్డు వద్దకు రాగానే వెనకు నుంచి వచ్చిన లారీ ఆయన బైక్ను ఢీకొట్టింది.
తలకు బలమైన గాయం కావడంతో ఎస్ఐ ఆనంద్కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఐ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి టిప్పర్తోపాటు డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ ఆనంద్కు భార్య ఇద్దరు పిల్లలున్నారు.
ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న మరో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను స్ధానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధితిని సమీక్షించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించిన చినరాజప్ప
కోరంగి ఎస్సై ఆనంద్కుమార్ మృతిపట్ల ఏపీ హోం మంత్రి చినరాజప్ప సంతాపం తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆనంద్కుమార్ కుటుంబ సభ్యులను హోం మంత్రి పరామర్శించారు. ఎస్సై కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.