కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కీలక సూచన చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..!!
రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తోంది. తన ఫోన్ ను ట్యాప్ చేస్తోన్నారనే ఆరోపణలతోనే ఎమ్యెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి దూరం అయ్యారు. ఎవరి ఫోన్లనైనా ట్యాప్ చేయడం సులభమేనా? అనే చర్చ సాగుతోం
అమరావతి: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం నడుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంతో ఇది తెర మీదికి వచ్చింది. తన ఫోన్ ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ ఆయన ఆరోపణలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని అడ్డుగా పెట్టుకుని ఆయన పార్టీకి దూరం అయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి.
టీడీపీ నుంచి పోటీ..
2024 ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇదే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటూ కోటంరెడ్డి కాల్ రికార్డ్- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తన ఫోన్ ను ట్యాప్ చేయడం వల్లే అది సాధ్యపడిందంటూ ఆరోపించారాయన. ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ సీతారామాంజనేయులు స్వయంగా తనకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారని విలేకరుల సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. తన ఫోన్ ను ట్యాప్ చేశారనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఫోరెన్సిక్ కు వెళ్లొచ్చు..
ఈ వ్యవహారంపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తోన్న ఆరోపణల్లో స్పష్టత లేదని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? లేక ఆయన మాటలను రికార్డ్ చేశారా? అనేది వివరించట్లేదని అన్నారు. దీన్ని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకీ పరీక్షకు పంపిస్తే వాస్తవం బయటపడుతుందని చెప్పారు. తన ఫోన్ ట్యాప్ చేసినట్లు అనుమానాలు ఉంటే ఆయన ఫోరెన్సిక్ కు వెళ్లొచ్చని లేదా మరేదైనా విచారణకూ డిమాండ్ చేయొచ్చని అన్నారు.
అంత సులభం కాదు..
ఎవరి ఫోన్లనైనా ట్యాప్ చేయడం అంత సులభతరం కాదని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అత్యున్నత దర్యాప్తు సంస్థలు సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ మాత్రమే ఇతరుల ఫోన్ ను ట్యాప్ చేసే అధికారం ఉందని, అవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తోన్నాయని గుర్తు చేశారు. ఫోన్ ట్యాప్ చేయాల్సిన పరిస్థితే ఎదురైనప్పుడు ఆయా దర్యాప్తు సంస్థల అధికారులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
ప్రత్యేక సందర్భాల్లోనే..
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉన్న ఫోన్ ట్యాపింగ్ అధికారాలను వినియోగించుకోగలదని, అది కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని లక్ష్మీనారాయణ అన్నారు. దేశ భధ్రత, అంతర్జాతీయ వ్యవహారాల అంశాల్లో మాత్రమే ఫోన్ ట్యాప్ జరుగుతుంటుందని వివరించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందనడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు.
రాజకీయ కారణాల కోసం..
ఒకవేళ ఏపీ ప్రభుత్వం తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి- ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే అది ఖచ్చితంగా చట్టవిరుద్ధమే అవుతుందని జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టవుతుందని వ్యాఖ్యానించారు. అలాంటి పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి లేదనే భావిస్తున్నానని అన్నారు.