జగన్ సర్కార్ కు కొటియా సెగ- ఒడిశా గ్రామాల్లో ఎంట్రీకి బ్రేక్-వైసీపీ ఎమ్మెల్యేకు భంగపాటు
ఏపీ-ఒడిశా మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కొటియా గ్రామాల సమస్యకు పరిష్కారం కనుచూపుమేరలో కానరావడం లేదు. స్వయంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటున్నా తాత్కాలికంగా వివాదాలు సద్దుమణగడం మినహా శాశ్వత పరిష్కారం లభించడం లేదు. దీంతో తాజాగా మరోసారి ఈ కొటియా గ్రామాల విషయంలో ఏపీ వర్సెస్ ఒడిశా గా పరిస్ధితి మారింది. కొటియా గ్రామాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ ఎమ్మెల్యేతో పాటు అధికారుల్నీ అక్కడి ఎమ్మెల్యేలు, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వీరు వెనుదిరగక తప్పలేదు.
కొటియా గ్రామాల వివాదం
ఏపీ, ఒడిశా సరిహద్దుల్లోని కొటియా గ్రామాల సమస్యకు శతాభ్దానికి పైగా చరిత్ర ఉంది. స్వాతంత్రానికి పూర్వం నుంచే కొటియా గ్రామాలపై ఏపీ, ఒడిశా రాష్టాలు కొట్లాడుకుంటున్నాయి. కొన్ని దశాబ్దాలుగా దీనిపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తడం, అవి సుప్రీంకోర్టు వరకూ వెళ్లడం, కోర్టు ఆదేశాలతో తాత్కాలికంగా ఉద్రిక్తతలు చల్లారడం, మళ్లీ ఏదో ఒక సమయంలో అవి తెరపైకి రావడం జరుగుతూనే ఉన్నాయి. ఈ వివాదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు ముందుకు రాని నేపథ్యంలో అవి పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. దీంతో ఇప్పటికీ ఆ వివాదాలు ఇరు రాష్ట్రాల్ని ఇబ్బందిపెడుతూనే ఉన్నాయి. దీంతో ఎప్పటికప్పుడు చల్లారినట్లే చల్లారే ఈ వివాదం మళ్లీ మళ్లీ తెరపైకి వస్తూనే ఉంది
పట్టుకోసం ఏపీ-ఒడిశా ప్రయత్నాలు
కొటియా గ్రామాలు ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండటం, అసలే మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాలు కావడంతో వీటిపై పట్టు కోసం ఇరు రాష్ట్రాలూ తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు వంటి చర్యల ద్వారా వీటిపై పట్టు సాధించేందుకు ఇరు రాష్ట్రాలూ చేయని ప్రయత్నం లేదు. ఇలాంటి సందర్భాల్లోనే ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. వీటిపై అప్పటికప్పుడు అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని తమ వర్గాల్ని శాంతింపజేయడంతో ఎప్పటికప్పుడు ఇదో పరిష్కారం లేని సమస్యగా మిగిలిపోతోంది. తాజాగా ఇలాంటిదే మరో ప్రయత్నం జరిగినా ఫలితం మాత్రం లేకుండాపోయింది.
కొటియాలో ఏపీ ఎన్నికలు
కొటియా గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం గతంలో చాలా సార్లు ఎన్నికలు నిర్వహించింది. తాజాగా పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహించింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నించనప్పుడల్లా ఒడిశా సర్కార్ కోర్టుల్ని ఆశ్రయిస్తోంది. తమ భూభాగంలో ఏపీ ప్రభుత్వం ఎలా ఎన్నికలు నిర్వహిస్తుందని ప్రశ్నిస్తూనే ఉంది. కోర్టులు జోక్యం చేసుకున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. దీంతో సుప్రీంకోర్టు కూడా ఎన్నికల నిర్వహణ వరకూ సరే కానీ ఈ వివాదం మాత్రం ఇరువురూ కూర్చుని పరిష్కరించుకోవాలని ఇరు రాష్టాల్నీ కోరుతోంది. కానీ దీనికి ఇరు రాష్ట్రాలూ అంగీకరించడం లేదు. ఒడిశా కోరుతున్న విధంగా ఈ కొటియా గ్రామాల్ని వదులుకునేందుకు ఏపీ సిద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణం.
సాధారణంగా ఒడిశాదే పట్టు
ఎన్నికల సమయంలో ఏపీకి గుర్తుకొచ్చే కొటియా గ్రామాలు సాధారణ సమయంలో మాత్రం గుర్తుకు రావు. దీంతో అక్కడ ఒడిశా ఎమ్మెల్యేలు క్రమంగా పాగా వేయడం మొదలుపెట్టారు. ఏపీకి సరిహద్దుల్లో విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే మాత్రమే ఉండగా.. కొటియా గ్రామాలకు ఆనుకుని ఒడిశాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. పొట్టంగి, కోరాపుట్, జయపుర ఎమ్మెల్యేలు కొటియా గ్రామాల్ని కాపాడుతున్నారు. వీరంతా ఏడాది పొడవునా కొటియా గ్రామాల్లోనే తిరుగుతుంటారు. దీంతో వీరికి అక్కడ ఎక్కువగా పట్టుంది. ఏపీకి చెందిన సాలూరు ఎమ్మెల్యే మాత్రం అడపాదడపా అక్కడికి వెళ్లినా కొటియా గ్రామాల్లో మద్దతు లభించేంత పట్టు లేదు. దీంతో ఏపీ కూడా మిన్నకుండిపోతోంది.
పథకాల అమలుకు జగన్ సర్కార్ యత్నం
కొటియా గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకే పరిమితమవుతున్న ఏపీ ప్రభుత్వం ఈసారి సంక్షేమ పథకాల అమలుకు కూడా సిద్ధమైంది. ఇప్పటికే పథకాల అమలు కోసం ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం,.... తాజాగా పాఠశాలలు తెరిచిన సందర్భఁగా అక్కడ జగనన్న విద్యాకానుక అమలు కోసం ఏర్పాట్లు చేసింది. వైసీపీకి చెందిన సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొరతో పాటు ఐటీడీఏ పీవో, ఇతర అధికారులు కొటియా గ్రామాలకు వెళ్లారు. సంక్షేమ పథకాల అమలు ద్వారా కొటియా గ్రామాల ప్రజల్ని ఆకట్టుకోవాలన్నదే వీరి లక్ష్యం. కానీ వివాదాస్పద గ్రామాలు కావడంతో వీరి ఎత్తుగడలు ఫలించలేదు. విద్యాకానుల అమలు కోసం వెళ్లిన వీరికి ఇబ్బందులు తప్పలేదు.
ఏపీ సర్కార్ కు భంగపాటు
జగనన్న విద్యాకానుక అమలు కోసం అధికారులతో కలిసి కొటియా గ్రామాలకు వెళ్లిన సాలూరు వైసీపీ ఎమ్మెల్యే రాజన్నదొరను ఒడిశా అడ్డుకుంది. ఒడిశాకు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీలతో సంబంధం లేకుండా అక్కడికి తరలివచ్చారు. ఎమ్మెల్యే రాజన్నదొరతో పాటు ఇతర అధికారుల్ని అడ్డుకున్నారు. కొటియా గ్రామాల్లోకి వెళ్లనివ్వలేదు. జగనన్న విద్యాకానుక పంపిణీకి వెళ్లిన అధికారులను భయభ్రాంతుల్ని చేసారు. వారి నుంచి పుస్తకాలు లాక్కున్నారు. దీంతో వీరంతా సాలూరు తిరిగి వచ్చేశారు. అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా, ఏపీ పోలీసు అధికారులు చర్చించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఉద్రిక్తతలు మంచివి కావనే అభిప్రాయానికి వచ్చారు. సాలూరు ఎమ్మెల్యేకు నచ్చజెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఒడిశా సరిహద్దుల్లో అక్కడి నాయకులు, పోలీసులు మోహిరంచారని, విజయనగరం జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారుల సూచన మేరకే తాము అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చినట్లు చెప్పారు.