కృష్ణ - ఎన్టీఆర్ నాటి వివాదం ఏంటి : కాంగ్రెస్ ఎంపీ అవ్వటం వెనుక..!!
సూపర్ స్టార్ కృష్ణ. నాడు ఏది చేసినా సంచనలమే. తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్. ఎన్నో గెలుపు ఓటములను .. మరెన్నో పరాభవాలను గెలుపుకు మలచుకున్న రియల్ హీరో. ఇప్పుడు ఆటువంటి హీరో కన్నుమూసారు. కృష్ణ రీల్ హీరోనే కాదు, రియల్ హీరో కూడా. ఎన్టీఆర్ వంటి కొరకంచుల్ని సవాల్ చేసారు. ఒక దశలో ఎన్టీఆర్ తో కలిసి నటించాలనే కోరిక కలిగిన కృష్ణ ..ఆ తరువాత రాజకీయంగా ఎన్టీఆర్ తో విభేదించారు.
కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన కృష్ణ
1970వ దశకంలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమానికి కృష్ణ మద్దతుగా నిలిచారు. 1982లో కృష్ణ నటించిన ఈనాడు సినిమా టీడీపీకి అనుకూలంగా తీసినట్లుగా నాటి రాజకీయాల్లో ప్రచారం సాగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు సహకరించినట్లుగా అందరూ భావించారు. సినీ ప్రముఖులుగా ఎన్టీఆర్ - కృష్ణ మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. కానీ, రాజకీయంగా మాత్రం ఇద్దరి మధ్య గ్యాప్ మొదలైంది. 1984లో జరిగిన రాజకీయ పరిణామాల్లో నాడు నాదెండ్ల భాస్కరరావు సీఎంగా ఎన్టీఆర్ ను కూలదోసి ఆ పదవి దక్కించుకున్నారు. దీనికి సంబంధించి ఆ సమయంలో కృష్ణ ఇచ్చిన ఒక ప్రకటన రాజకీయ కలకలం రేపింది. ఎన్టీఆర్ తిరిగి సీఎం అయ్యారు. అయినా..ఇద్దరి మధ్య పొలిటికల్ గ్యాప్ కొనసాగింది.

రాజీవ్ గాంధీ మద్దతుతో ఏపీలో
ఇందిరా మరణించిన సమయంలో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కృష్ణ ఢిల్లీ వెళ్లారు. రాజీవ్ గాంధీని కలిశారు. ఆ సమయంలో ఏపీలో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని అడ్డుకోవలంటే సినీ గ్లామర్ అవసరమని భావించి..కృష్ణ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. 1984లో కాంగ్రెస్ లో చేరిన కృష్ణ 1989లో కాంగ్రెస్ ఎంపీగా ఏలూరు నుంచి గెలుపొందారు. ఏలూరులోనే కృష్ణ న కాలేజీ విద్య పూర్తి చేసారు. ఆ ఎన్నికల్లో బోళ్ల బుల్లిరామయ్య టీడీపీ నుంచి పోటీ చేసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశం కోసం ఆస్తులను త్యాగం చేసిన రాజీవ్ గాంధీ కి ఓటు వేసి గెలిపిస్తారా లేకపోతే కనీసం పిళ్లికి కూడా బిచ్చం పెట్టని ఎన్టీఆర్ కు ఓటు వేస్తారా అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ అభ్యర్ధి మీద ఆయన మీద 71,407 ఓట్ల మెజార్టీతొ కృష్ణ గెలిచారు. 1991 లోక్ సభ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు తొలుత గుంటూరును ఎంచుకున్నారు. కానీ, కాంగ్రెస్ అధినాయకత్వం తిరిగి ఏలూరు నుంచి బరిలో దించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి బోళ్ల బుల్లి రామయ్య చేతిలో 47,655 ఓట్ల తేడాతో కృష్ణ ఓడిపోయారు.
ఎన్టీఆర్ తో రాజకీయంగా విభేదాలు
రాజీవ్ గాంధీ మరణం, కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలతో ఆ తరువాత కృష్ణ రాజకీయ రంగానికి దూరమయ్యారు. ఇక, కాంగ్రెస్ లో ఉన్న సమమయంలో నాటి ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ వ్యంగ్య సినిమాలకు కృష్ణ ప్రాధాన్యత ఇచ్చారు. అందులో మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి వంటి సినిమాలు రాజకీయ విమర్శలకు కారణమయ్యాయి. కృష్ణ తీసిన నా పిలుపే ప్రభంజనం సినిమా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీసారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ పాత్రతో పాటుగా ఆయన అల్లుళ్లు దగ్గుబాటి - చంద్రబాబు పాత్రలను పోలిన పాత్రలను సినిమాలో చూపించారు. ఆ సినిమాలో కృష్ణ డీసీపీ పాత్ర పోషించారు. రాజకీయంగా తిరుగుబాటు రావడం సినిమా క్లైమాక్స్ లో చూపిస్తారు. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ -కృష్ణ రాజకీయ దూరం మరింత పెరిగిపోయింది.

వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం
వైఎస్సార్ సీఎం అయిన తరువాత కృష్ణ కుటుంబం మొత్తం వైఎస్సార్ కు దగ్గర అయింది. పలుమార్లు కృష్ణ - వైఎస్సార్ మధ్య స్నేహపూర్వక సమావేశాలు చోటు చేసుకున్నాయి. ఆ తరువాత జగన్ ను కృష్ణ కుటుంబం కలిసింది. కానీ, తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ టీడీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గెలిచారు. కృష్ణ మరణంతో ఇప్పుడు ఆయన పొలిటికల్ కెరీర్ మరోసారి చర్చల్లో నిలిచింది.












Click it and Unblock the Notifications