కృష్ణా బోర్డు ఆదేశాలు బేఖాతరు .. ఏ లెక్కా చెప్పని ఏపీ, తెలంగాణా .. తీవ్ర అసహనంలో బోర్డు
కృష్ణా నదీ జలాల విషయంలో ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచాయతీని పరిష్కరించలేకపోతున్న కృష్ణానది యాజమాన్య బోర్డు, తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో తీవ్ర అసహనంతో ఉంది.రెండు తెలుగు రాష్ట్రాల నుండి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం రావడంలేదని కృష్ణా బోర్డు చిరాకు పడుతోంది. ఇప్పటికే పలు సందర్భాలలో కేంద్ర జలవనరుల శాఖకు ఈ విషయాన్ని తెలియజేసిన కృష్ణా బోర్డు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బేసిన్ లోని ఉప నదుల నీటి ప్రవాహాల లెక్కలపై లేఖలు రాసినప్పటికీ స్పందించకపోవడంతో ఆగ్రహంతో ఉంది.
కృష్ణా బేసిన్ లో ఉపనదుల నీటి లెక్కలు చెప్పమన్న కృష్ణా బోర్డు
కృష్ణా నదిపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర ప్రాజెక్టులకు వస్తున్న కృష్ణా జలాలు, ఆ నీటి వినియోగానికి సంబంధించిన వివరాలను కృష్ణా బోర్డుకు తెలుగురాష్ట్రాలు సమర్పిస్తున్నట్లుగానే కృష్ణా బేసిన్ లోని ఉపనదులలో ఉన్న నీటి వినియోగం లెక్కలను కూడా తెలపాలని కృష్ణా బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఉప నదుల నీటి లెక్కలపై స్పష్టత ఉంటేనే నీటి కేటాయింపులు, వినియోగం పారదర్శకంగా ఉంటాయని రెండు రాష్ట్రాలకు తెలిపింది.అయినా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణాబోర్డు అడిగిన లెక్కలను ఇప్పటివరకు సమర్పించలేదు.
తెలుగు రాష్ట్రాల నుండి నో రెస్పాన్స్ .. మరోమారు లేఖలు రాయాలని నిర్ణయం
త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా పడడంతో ఈ అంశంపై చర్చ కూడా జరగలేదు. రెండు తెలుగు రాష్ట్రాలు స్పందించకపోవడంతో మరోమారు రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖలు రాయాలని భావిస్తోంది. ఉప నదుల నీటి లెక్కలు మాత్రమే కాకుండా, గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రకాశం బ్యారేజీ లోకి వచ్చిన వరద, వినియోగించుకున్న నీరు, దిగువకు విడుదల చేసిన నీటి లెక్కలు చెప్పాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరినా అటు ఏపీ లోని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్ కానీ స్పందించిన దాఖలాలు లేవు.
ప్రభుత్వాల వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచన
రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా బోర్డు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కృష్ణా బోర్డు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని ఆలోచనలో ఉంది. ఏది ఏమైనా కృష్ణా నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య పలు వివాదాలు కొనసాగుతున్న వేళ, ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ లతో సతమతమవుతున్న కృష్ణా బోర్డు, ఇప్పుడు తమ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ప్రభుత్వాల తీరుపై భగ్గుమంటోంది.
గతంలోనూ కేంద్రానికి ఫిర్యాదు.. రెండు రాష్ట్రాల తీరుతో తీవ్ర అసహనంలో కృష్ణా బోర్డు
ఇటీవల గతేడాది నీటి వాటాల్లో భాగంగా తెలంగాణాకు కేటాయించిన జలాలను పూర్తిగా వినియోగించుకోలేదని వాటిని ఈ ఏడాది వినియోగించుకుంటామని తెలంగాణా కృష్ణా బోర్డును కోరింది. అయితే ఏ ఏడాది లెక్కలు ఆ ఏడాదే అని అలా తర్వాత సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ కావని ఏపీ వాదించింది . ఇరు రాష్ట్రాలు విబేధించిన వేళ కేంద్రానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది. కృష్ణా నదీ జలాల్లో గత ఏడాది నీటి వాటాలో వినియోగించుకోకుండా మిగిలిన నీటిని తర్వాత సంవత్సరం ఉపయోగించుకోవచ్చా? లేదా? అన్న అంశంపై కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి కృష్ణానది యాజమాన్య బోర్డు లేఖ రాసింది. నీటి వినియోగంలో ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలోనే లేఖ రాసింది. ఇప్పుడు ఎవరూ లెక్కలు చెప్పటం లేదని కేంద్రానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉంది .