నాగాయలంక ఎస్సై మానవత్వం- కుటుంబ సభ్యులు వదిలేసినా- కరోనా మృతుడికి అంత్యక్రియలు..
కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక భౌతిక దూరం పాటిస్తే చాలని ప్రభుత్వాలు చెబుతుంటే జనం మాత్రం అన్ని బంధాలకూ దూరమైపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. చివరికి కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా తమ రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టుకుంటూనే ఉన్న వార్తలూ వింటూనే ఉన్నాం. ఏపీలోనూ ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలోనూ ఎక్కడో చోట మానవత్వం మిగిలే ఉందని నిరూపించే ఘటనలు నిరూపిస్తున్నాయి. సొంత మనుషులే వదిలేసిన కరోనా మృతుడి అంత్యక్రియలను నిర్వహించడం ద్వారా కృష్ణాజిల్లా పోలీసు ఎస్సై శభాష్ అనిపించారు.
జైలులో ఉన్నా కరోనా వదల్లేదుగా: 44 శాతం మంది ఖైదీలకు పాజిటివ్: ఎలా సోకిందో అర్థం కాక
ఫ్రంట్ లైన్ వారియర్లుగా...
కరోనా మొదలైన తర్వాత జనాన్ని ఇళ్లలో నుంచి బయటికి రాకుండా అడ్డుకోవడం ద్వారా వ్యాప్తిని అడ్డుకున్న పోలీసులు ఫ్రంట్ లైన్ వారియర్లుగా పేరు తెచ్చుకున్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోడ్లపై విధులు నిర్వర్తిస్తూ జనం ప్రాణాలు కాపాడారు. కరోనా వైరస్ కూ, ప్రజలకూ మధ్య అడ్డుగోడలా నిలబడి సేవలు అందిస్తూ వైరస్ సోకిన పోలీసులు కూడా ఉన్నారు. ఇలాంటి వారి సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కరోనా కట్టడిలోనే కాదు మానవత్వంలోనూ తామే సాటి అని ఓ ఎస్సై నిరూపించుకున్న ఘటన కృష్ణాజిల్లా నాగాయలంకలో చోటు చేసుకుంది. మానవత్వానికే ప్రతీకగా నిలుస్తున్న ఈ ఘటన ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.
మంటగలిసిన మానవత్వం..
కృష్ణాజిల్లా నాగాయలంకలో ఓ వ్యక్తికి కరోనా టెస్ట్ చేయగా ఫలితం రావాల్సి ఉంది. ఇంతలోనే అతని భార్యకు కూడా పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. ఇంతలోనే గురువారం తెల్లవారుజామున ఆ వ్యక్తి ఇంటిలోనే చనిపోయాడు. ఇంటిలో ఉన్న శవం వద్దకు భార్యతో సహా ఎవరు వెళ్ళడానికి సాహసించలేదు. కనీసం శవంపై గుడ్డ కప్పే వారే కరువయ్యారు. అధికారులు విషయం తెలుసుకుని వెళ్ళినా సుదూర ప్రాంతంలో ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంచాయతీ సిబ్బంది అయినా శవాన్ని తీస్తారేమో అనుకుంటే వారు కూడా అక్కడికి వెళ్లడానికి నిరాకరించారు. తెల్లవారు జాము నుండి సాయంత్రం వరకు ఇంటిలోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. గుడ్డకూడా శవంపై కప్పని పరిస్థితి నెలకొంది. ఇలాంటి చావు ఎవరికి రాకూడదు దేవుడా అంటూ ఆ ప్రాంత ప్రజలు వేడుకున్నారు.
Recommended Video
నేనున్నా అంటూ రంగంలోకి...
కరోనా భయంతో కుటుంబ సభ్యులు సైతం అంత్యక్రియలు నిర్వహించందుకు ముందుకు రాలేదు. పరిస్ధితి తెలుసుకున్న నాగాయలంక ఎస్సై చల్లా కృష్ణ ఎలాగైనా మృతుడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు స్వచ్ఛ నాగాయలంక కార్యకర్తలు తలశిల రఘుశేఖర్, నారాయణ, డీటీ సుబ్బారావు కలిసి ఎవరూ ముట్టుకునేందుకు సాహసించని మృతదేహాన్ని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి స్మశానానికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆ చనిపోయిన వ్యక్తికి కరోనా ఉందొ లేదో తెలియదు కానీ, అటువంటి వ్యక్తి మృతదేహానికి అంతిమ సంస్కారం చేసినందుకు మనసు తృప్తిగా ఉందని ఎస్ ఐ చల్లా కృష్ణ తెలిపారు. అంతిమ సంస్కారానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. మానవత్వం చూపి, అంతిమ సంస్కారాలు నిర్వహించిన నాగాయలంక ఎస్ ఐ చల్లా కృష్ణను, స్వచ్ఛ నాగాయలంక సభ్యులను అందరూ మెచ్చుకుంటున్నారు.