వారానికి 3రోజులు బాబు బెజవాడలోనే, క్యాంప్ ఆఫీస్ ఓఎస్డీగా కృష్ణమోహన్
అమరావతి: ఇకపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచే పరిపాలన కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే శుక్రవారం ఏపీ కేబినెట్ భేటీ కూడా అక్కడే నిర్వహించనున్నారు. ఇప్పటికే విజయవాడలో ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీస్ ఓఎస్డీగా కృష్ణమోహన్ని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రభుత్వం వ్యవహారాలన్ని ఇకపై ఆయనే చూడనున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు గురువారం ఉదయం రామేశ్వరం వెళ్లిన చంద్రబాబు మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్నారు.
మధురై నుంచి ప్రత్యేక విమానంలో ఏపీ సీఎం చంద్రబాబు గన్నవరం చేరుకుని అక్కడి నుంచి నేరుగా విజయవాడకు వెళ్లారు. సాయంత్రం విజయవాడలోని క్యాంప్ ఆఫీస్లో సాయంత్రం పర్యాటక శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల అమలు తీరుపై ఉన్నతాధికారులతో భేటీ అయి ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
పోలవరం కుడి కాలువ పనులపై కూడా సమీక్షిస్తారు. రేపు(శుక్రవారం) ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరుగనుండగా, ఆగష్టు 1న తెలుగుదేశం ప్రజాప్రతినిదులతో చంద్రబాబు సమావేశం అవుతారు.