ఇథనాల్ దెబ్బకు రికార్డు స్దాయికి పంచదార ధరలు..! జనం గగ్గోలు..!
దేశవ్యాప్తంగా పెట్రోల్ లో ఇథనాల్ (Ethanol) కలిపి ఈ 20 (E20) పేరుతో ఆ మిశ్రమాన్ని వాహనదారులకు అందించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాల ప్రతికూల ప్రభావాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. వాహనాల మైలేజ్ లు తగ్గిపోవడం, ఇంజన్లు చెడిపోవడం వంటి దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా ఇథనాల్ తరలింపు ప్రభావం చక్కెర ధరలపైనా పడుతోంది. దీంతో దేశంలో చక్కెర ధరలు (Sugar Prices) రికార్డు స్ధాయికి పెరిగిపోయాయి.
వాహనాలకు వినియోగించే పెట్రోల్ లో ఇథనాల్ కలపాలన్న కేంద్రం నిర్ణయం నేపథ్యంలో భారీ ఎత్తున చెరుకు నుంచి ఇథనాల్ తీసే కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా డిస్టిలరీను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకును మళ్లించడం వల్ల పంచదార తీయడానికి చెరుకు తగ్గిపోతోంది. ఇదే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. అసలే ఇప్పుడు పండుగల సీజన్ వస్తోంది. దేశంలో చక్కెర తగినంత అందుబాటులో లేకపోతే జనం గగ్గోలు పెట్టడం ఖాయం. దీంతో కేంద్రం ఇరుకునపడుతోంది. చక్కెర ధరల్ని సాధారణ స్దాయికి తీసుకురావాలంటే దిగుమతులు ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. అయితే దాని కంటే ముందుగా చక్కెరపై అమలులో ఉన్న 100 శాతం దిగుమతి సుంకాన్ని తొలగించాల్సి ఉంది.

తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలోని కీలక చక్కెర మార్కెట్లలో ధరలు భారీగా పెరిగాయి. దేశంలోనే అతిపెద్ద చక్కెర మార్కెట్ అయిన మహారాష్ట్రలోని కొల్హాపూర్లో హోల్ సేల్ చక్కెర ధరలు ఆగస్టు ప్రారంభం నుండి దాదాపు 20 శాతం పెరిగాయి. 100 కిలోలకు రికార్డు స్థాయిలో రూ.5,350కి చేరుకున్నాయి. వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం చూసినా తాజాగా ఆగస్టు 18 నాటికి దేశంలో సగటు రిటైల్ ధర కిలోకు రూ.52.3గా ఉంది. కొన్ని మార్కెట్లలో ఈ పెరుగుదల తీవ్రంగా ఉంది. పంజాబ్లో కిలోకు సుమారు రూ.65కు చేరగా, ముంబై, భోపాల్, ఇతర మార్కెట్లలోని కొన్ని ప్రాంతాలలో కిలోకు రూ.58-63 మధ్య ఉన్నాయి. దీంతో ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమం ఆహార ధరలపై ప్రభావం చూపకుండా సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.













Click it and Unblock the Notifications